రాహుల్ కాదు, వాళ్ల జేజేమ్మ దిగొచ్చినా.., మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
‘రాహుల్ గాంధీ కాదు, వాళ్ల జేజేమ్మ దిగొచ్చినా మనల్ని ఏమీ చేయలేరు..’ అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుందని, మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారన్నారు.
హైదరాబాద్: 'రాహుల్ గాంధీ కాదు, వాళ్ల జేజేమ్మ దిగొచ్చినా మనల్ని ఏమీ చేయలేరు..' అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు బుధవారం టీఆర్ఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నాడు కేసీఆర్ చేసిన పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నాయకులకు బాస్ లు ఢిల్లీలో ఉండొచ్చు, కానీ, టీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ ప్రజలే బాస్ లని, వేరే వాళ్లెవరూ బాస్ లు కాదని, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో, వారికి ఏం కావాలో తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన అన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుందని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే విషయం రేవంత్ రెడ్డికే కాదు, వాళ్ల నాయకురాలు సోనియాగాంధీకి, ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కూడా తెలుసని మంత్రి కేటీఆర్ చెప్పారు.