మంత్రి మల్లారెడ్డి సోదరుడు అరెస్ట్-పేకాట శిబిరంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సోదరుడు చామకూర నర్సింహారెడ్డి(66) పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. గత కొన్నాళ్లుగా పేకాట శిబిరాలపై ఉక్కుపాదం మోపుతున్న టాస్క్ఫోర్స్ పోలీసులు... తాజాగా న్యూ బోయిన్పల్లిలోని ఓ పేకాట శిబిరంపై దాడులు చేశారు.మొత్తం 11 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేయగా... ఇందులో మంత్రి మల్లారెడ్డి సోదరుడు నర్సింహారెడ్డి కూడా ఉన్నారు.
బోయిన్పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్స్ ప్రాంతంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో పేకాటరాయుళ్లంతా కలిసి కొన్నాళ్లుగా పేకాట ఆడుతున్నట్లు నార్త్ జోన్ టాస్క్ఫోర్స్కి సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఫంక్షన్ హాల్పై దాడి చేసి అందరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పట్టుబడినవారిలో నర్సింహారెడ్డితో పాటు భాస్కర్రెడ్డి (49), గోవర్ధన్రెడ్డి (42), జనార్ధన్రెడ్డి (42), శ్రీనివాసరాజు (57), వెంగళ్రెడ్డి (43), నర్సిరెడ్డి (64), కృష్ణ (40) కౌడి సాయిలు (44), నర్సింహారావు (65), హనుమంతు (58), సుదర్శన్రెడ్డి (64), మోహన్రెడ్డి (49) ఉన్నారు.
నిందితుల వద్ద రూ1.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అనంతరం బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో వీరిని అప్పగించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన బోయిన్పల్లి పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు.
మంత్రి మల్లారెడ్డి తరచూ వార్తల్లోకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో భూకబ్జా ఆరోపణలతో ఆయన వార్తల్లోకి ఎక్కారు. కొద్దిరోజుల క్రితం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఆయన ఫోన్లో బెదిరించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా సోదరుడి కారణంగా ఆయన పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కినట్లయింది.
Recommended Video