మేనమామ ముందుకు రాకున్నా.. నేనున్నాంటూ కేసీఆర్..: మంత్రి పువ్వాడ
ఖమ్మం: పేదింటి సొంతింటి కలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సాకారం చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం వైరా నియజకవర్గం కారేపల్లి మండలం విశ్వనాథపల్లి గ్రామంలో రూ.1.25 కోట్ల రూపాయలతో నిర్మించిన 20 డబుల్ బెడ్ రూం ఇళ్లను జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే రాములు నాయక్తో కలిసి ప్రారంభించారు.
నేనున్నాంటూ కేసీఆర్..
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేదల సొంతింటి కల తీరిపోయిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మేనమామ కూడా పెళ్లి చేయడానికి ముందుకు రావడం లేదని, కానీ కేసీఆర్ మాత్రం నేను ఉన్నానని ముందుకు వచ్చారని, పేదింటి ఆడపిల్ల పెళ్లయితే రూ.లక్ష ఇస్తున్నారని ఇది చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేదన్నారు.
రాజకీయ ప్రమేయం లేకుండా..
సంక్షేమ హాస్టల్స్లో, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో పెడుతున్న ఘనత కూడా కెసిఆర్కే దక్కుతుందన్నారు. జిల్లాకు 7వేల డబుల్ బెదరూమ్ ఇళ్ళు మంజూరు అయ్యాయని వాటన్నిటినీ పూర్తి చేసి పేదలకు అందిస్తామన్నారు. ఒక్కో ఇంటికి రూ.6.25 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. రానున్న రోజుల్లో ప్రతి పేద వాడికి ఇళ్ళు ఇవ్వాలనే సంకల్పంతో సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కొరకు రు. 5 లక్షలు ఇవ్వనునన్నామన్నారు. ఈ పథకం ద్వారా వచ్చే 4 ఏళ్లలోపు పేదలందరికి ఇళ్ళు వస్తాయని మంత్రి అన్నారు. నిజమైన పేదలకు అత్యంత పారదర్శకంగా ఇండ్లు కేటాయిస్తాం.. ఎక్కడా రాజకీయ ప్రమేయం లేకుండా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు.
దేశానికి రోల్ మోడల్..
దరఖాస్తుల కోసం ఎవరు డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారిని ప్రభుత్వమే గుర్తించి వారికి ఇల్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. దేశానికే రోల్మోడల్గా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లును నిర్మిస్తున్నారని, గేటెడ్ కమ్యూనిటీని తలపించే రీతిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. రోజువారీ అవసరాలకు అనుగుణంగా దుకాణాలు, మార్కెట్, త్రాగునీరు, విద్యుత్ సహా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. అత్యంత పారదర్శకంగా పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక జరుగుతుందన్నారు. సాగునీటి అవసరాల కోసం రూ.40 కోట్లతో బుగ్గవాగు ప్రాజెక్టును మంజూరు చేయించాన్నారు. సీతారామ ప్రాజెక్ట్కి ముందే బుగ్గవాగు ప్రాజెక్టును పూర్తి చేస్తామని తద్వారా కారేపల్లి, కామేపల్లి, రఘునాథపాలెం మండలంలోని చెరువులను లిఫ్ట్ ద్వారా నింపుతు సాగు నీటి కొరత లేకుండా చేస్తామన్నారు.