తెలంగాణాలో ఆ మంత్రి రూటే సపరేటు ... సైకిల్ మీద నగరమంతా పర్యటించిన మంత్రి
ఆయన ఓ తెలంగాణ మంత్రి. కారు పార్టీలో కీలక నాయకుడిగా,ప్రజా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సదరు మంత్రి సైకిల్ ఎక్కి నగరమంతా పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఇలా సైకిల్ మీద పర్యటన చేయడం ఈ మంత్రివర్యుల కు కొత్తేం కాదు. గతంలోనూ ఆయన సైకిల్ పై హడావుడి చేసిన అనేక సందర్భాలున్నాయి.
గవర్నర్,సీఎం కేసీఆర్ ల మధ్య కరోనా చిచ్చు పెట్టిందా ? సీరియస్ గా గవర్నర్ సమీక్షల మతలబు అదేనా ?
రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పువ్వాడ అజయ్ కుమార్ ఈరోజు ఉదయం ఖమ్మం నగరంలో సైకిల్ పై పర్యటించారు. నగరంలో నెలకొన్న సమస్యలు తెలుసుకోవడం కోసం, ఆ సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలనే దానిపై పరిశీలించడం కోసం సైకిల్ పై నగర సంచారానికి వెళ్లారు. ఈరోజు తెల్లవారుజామున సడన్ గా సైకిల్ పై పర్యటన మొదలు పెట్టిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు.
ఖమ్మం నగరంలో కొనసాగుతున్నఅభివృద్ధి పనులను పరిశీలించారు. పలు కూడళ్లను సైకిల్ మీద సందర్శించి అక్కడి సమస్యలను ప్రజలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు తాజాగా కరోనా నేపథ్యంలో ఖమ్మం నగరంలోని పరిస్థితులు, నిర్వహిస్తున్న శానిటేషన్ పనులు, తీసుకుంటున్న జాగ్రత్తలపై కూడా ఆయన నగర వాసులు తో మాట్లాడారు. స్మశాన వాటికలు అక్కడ నెలకొన్న ఇబ్బందులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక తన పర్యటనలో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు,జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు మంత్రి పువ్వాడ.
గతంలో కూడా పలుమార్లు సైకిల్ పై ఖమ్మం నగరంలో సైకిల్ పై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ తరహా పర్యటనలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజా పర్యటన తోనూ, ప్రజలతో నేరుగా మాట్లాడటమే కాకుండా,ఖమ్మం నగరంలోని సమస్యలను నేరుగా తెలుసుకొని ప్రజా ప్రతినిధిగా తన బాధ్యతను నిర్వర్తించారు మంత్రి పువ్వాడ. అయితే సైకిల్ పై ఆయన నగర వీధుల్లో తిరగడం ఖమ్మం నగరంలో ఆసక్తికర చర్చ గా మారింది.