గులాబీదళంలో మంత్రులు, ఎమ్మెల్యేల దూకుడు.. దుర్భాషలాట
హైదరాబాద్: తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలు, మరోసారి అధికార యంత్రాంగం పట్ల అనుచితంగా వ్యవహరిస్తుండటం వెలుగులోకి వస్తున్నది. పార్టీ కిందిస్థాయి కార్యకర్తలంటే 'డోంట్ కేర్' అన్నట్లు వ్యవహరిస్తున్న వైనం కనిపిస్తున్నది. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల మధ్య ప్రొటోకాల్ వివాదం పొడచూపుతున్నది. ఎంపీ అయితే ఏం చేస్తాడని సాక్షాత్ మంత్రి తనయుడు వ్యాఖ్యానించడంతో పరిస్థితి ఎంత తీవ్రంగా పరిణమించిందో అర్థమవుతూనే ఉన్నది. మరోవైపు ఒక డీసీసీబీ సీఈఓను దుర్భాషలాడినందుకు సదరు ఎమ్మెల్యే పశ్చాత్తాప పడాలి.
కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యే కోమటిరెడ్డి సహచరుడితో కలిసి తన ఫోన్ రికార్డు చేసి బహిరంగం చేశారని.. తాను ప్రజలకు అన్యాయం జరుగుతుంటే సహించలేకే ప్రశ్నించానని సదరు ఎమ్మెల్యే సమర్థించుకుంటున్న తీరుతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పరాకాష్టకు చేరుకుంటున్నాయి. మంత్రులు, వారి తనయులు, ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న తీరు ఒకసారి పరిశీలిద్దాం..
చందూలాల్ కొడుకు కూడా ప్రజాప్రతినిధే.
రాష్ట్ర పర్యాటక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ కుమారుడు అజ్మీరా ప్రహ్లాద్. ఆయన కూడా ఒక ప్రజాప్రతినిధే. ములుగు పీఏసీఎస్ చైర్మన్గా ఉన్నారు. ఓ కార్యకర్తతో జరిగిన వాగ్వాదంలో మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్పై అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సొంత పార్టీ ఎంపీపైనే ప్రహ్లాద్ బూతు పురాణానికి దిగడం కలకలం రేపుతోంది
ఎంపీ పేరు చెబితే గొప్పా? అని ప్రహ్లాద్ సవాల్
జయశంకర్ జిల్లా ములుగు మండలం జంగాలపల్లి టీఆర్ఎస్ కార్యకర్త కే రవిదాసు మంత్రి కుమారుడు ప్రహ్లాద్కు ఫోన్ చేసి, తనకు పదవి రాలేదని ప్రస్తావించారు. మొన్నమొన్న వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని కొంచెం గట్టిగానే వాదించారు. ఆవేశానికి గురైన ప్రహ్లాద్.. ఉంటే ఉండు పోతే పొమ్మని దురుసుగానే మాట్లాడారు. ‘మేం ఎందుకు పోతాం సార్ అని కార్యకర్త నిలదీయగా, ఎంపీ పేరు చెబితే వాడు వచ్చి పీకుతాడా? ఏంటీ ఎంపీ గొప్ప?' అని నోరు పారేసుకున్నారు. ‘నువ్వు నాకు మెస్సేజ్ పెట్టినవు కదా? ఎంపీ నా నియోజకవర్గానికి వచ్చి పీకుతాడా' అంటూ బూతు పురాణం మొదలుపెట్టారు.
వాడు ఏ పదవి ఇస్తాడో చూస్తానని మంత్రి తనయుడి చిందులు
‘డెఫినెట్గా నువ్వు ఎంపీ దగ్గరికి పోవాలి. వాడు నీకు ఏం పదవి ఇస్తాడో చూస్తా' అని మంత్రి చందూలాల్ తనయుడు అజ్మీరా ప్రహ్లాద్ అన్నారు. వాడి పేరు చెప్పి నన్ను భయపెట్టిస్తున్నవా? అంటూ ప్రహ్లాద్ భగ్గుమన్నారు. దాదాపు మూడు నిమిషాల ఆడియోలో సీతారాంనాయక్ పేరు వాడటం గులాబీ పార్టీలో కలకలం రేపుతుంది. గతంలోనే ఈ ఘటన జరిగిందని, కావాలనే కొందరు ఆడియోను సోషల్ మీడియాలో పెట్టి మంత్రి కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రహ్లాద్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. వివరణ అడిగేందుకు ప్రహ్లాద్తోపాటు రవిదాసుకు ఫోన్లో ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు.
శంకుస్థాపన నుంచి వెళ్లిపోయిన ఎంపీ, ఎమ్మెల్సీ
వరంగల్ అర్బన్ జిల్లాలో అధికార పార్టీలో ప్రొటోకాల్ వివాదం చెలరేగింది. శంకుస్థాపన కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యేపై ఎంపీ, ఎమ్మెల్సీ గుర్రుగా ఉన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఖిలా వరంగల్ మండలం మామునూరులో పశు వైద్య కళాశాల భవన నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదు. సభా ప్రాంగణానికి వస్తే అక్కడ ఫ్లెక్సీలో ఎంపీ పసునూరు దయాకర్ పేరు, ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి పేర్లు కూడా పెట్టలేదు. దీంతో కినుక వహించిన వారిద్దరూ సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు.
సస్పెన్షన్ ముగిసినా విధుల్లోకి తీసుకోనందుకే..
ఉమ్మడి నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.. డీసీసీబీ సీఈఓ మదన్ మోహన్ ను దుర్భాషలాడారు. తన నియోజకవర్గంలోని మహిళకు జరుగుతున్న అన్యాయంపై ఓ ప్రజాప్రతినిధిగా మాట్లాడానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. డీసీసీబీలో నిధుల దుర్వినియోగంపై 21 మంది ఉద్యోగులపై చర్య తీసుకోవాలని సదరు బ్యాంకు ఆదేశించిందన్నారు. ఇందులో తొమ్మిదో నంబర్ ఉద్యోగినిగా ఉన్న ఉద్యోగి లక్ష్మిని ఆరు నెలలు సస్పెండ్ చేశారని తెలిపారు. సస్పెన్షన్ కాలంలో విచారణ చేసి తొలగించినా తమకు అభ్యంతరం ఉండేది కాదన్నారు. సస్పెండ్ పీరియడ్ ముగిసిన తర్వాత ఏడాది నుంచి తాను 50 సార్లు బ్యాంకు సీఈవోను సంప్రదించానని, ఆమె కూడా చాలా మందికి తన బాధను మొర పెట్టుకుందన్నారు. సస్పెన్షన్కు గురైన ఉద్యోగిని ఆమె వికలాంగురాలని, భర్త ఆరోగ్యం కూడా సరిగా లేదని, రూ.50 లక్షలు అతని వైద్యం కోసం ఖర్చు చేసిందని ఎమ్మెల్యే వివరించారు.
కోమటిరెడ్డి అనుచరుడితో కలిసి రికార్డ్ చేశారని ఆరోపణ
కుటుంబమంతా ఇబ్బందుల్లో ఉండటంతో ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో తన వద్దకు వచ్చిందని పేర్కొన్నారు. దీనిపైనే తాను ఫోన్లో అడిగితే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అనుచరుడు సంపత్రెడ్డి, సీఈవో కలసి రికార్డు చేశారని, మాట్లాడుతున్న సందర్భంలో దొర్లిన పదాన్ని పట్టుకొని ఉద్దేశపూర్వకంగా రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. బాధితురాలు తన బంధువు కాదని.. సామాన్య వ్యక్తి అని, అందుకే ఆమెకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడానని వీరేశం వివరణ ఇచ్చారు. ఆమెకు న్యాయం జరిగే వరకు తోడ్పాటును అందిస్తానన్నారు. ఆదివారం డీసీసీబీ సీఈఓవోతో మాట్లాడిన ఎమ్మెల్యే వీరేశం ‘బైలా ప్రకారం జీఎం, డీజీఎం, అసిస్టెంట్ జీఎం వరకు సీఈఓనే ఫైనల్ అని ఉంది కదా. బుక్ ప్రింట్ చేసినోడు చెప్పిండా. జీవో ఇచ్చినోడు తప్పు చేసిండా. మరి మీరు తప్పు చేస్తున్నరా.. నాకు అర్థం కావట్లే' అని అన్నారు.
దుర్భాషలాడిన ఎమ్మెల్యే వీరేశం
ఎమ్మెల్యే వీరేశం చేసిన వాదనపై సదరు సీఈఓ మదన్ మోహన్ ప్రతిస్పందిస్తే ‘వాడెవెడు ఆ పనికి.. నువ్వు ఎవడు.. వానిది నీది .. నీ అయ్య జాగీరా.. చైర్మన్, నువ్వు ఇద్దరం దోచుకుతింటమని రాసకొచ్చుకున్నరా.. వాడి మీద నువ్వు.. నీ మీద వాడు.. ఇద్దరిదీ పలగ్గొడతా.. నేను మంచిగుంటెనే మంచోణ్ని.. ఒక రోజు టైం అడిగినవ్.. సరేనన్న.. నువ్వు ఇంకా ఫైలే పెట్టకుండా మళ్లీ చైర్మన్ అనే వెధవ గురించి నాకు చెప్పొద్దు. ఉద్యోగం ఇస్తవా.. లేదా.. లేకుంటే నిన్ను, నీ చైర్మన్ను, సంపత్రెడ్డి అనేటోణ్ని ముగ్గుర్ని .. పలగ్గొడతా ఆడికి వచ్చి' అని వీరేశం మండిపడ్డారు.