మంత్రి సత్యవతి రాథోడ్కు మరో ప్రమోషన్: ‘నానమ్మ’కు స్వీట్లు తినిపించారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యవతి రాథోడ్ శనివారం నానమ్మ అయ్యారు. రాష్ట్ర గిరిజన, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సత్యవతి రాథోడ్ ఇటీవలే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, హుజూర్నగర్ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె అక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరపున విస్తృత ప్రచారం చేస్తున్నారు.
స్వీట్లు తినిపించిన నేతలు
మఠంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సత్యవతి రాథోడ్కు మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, టీఆర్ఎస్ పార్టీ నేతలు రామచంద్రు నాయక్, రమణనాయక్, ఇతర నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. నానమ్మ అయిన సందర్భంగా ఆమెకు నేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రచారం దూసుకెళ్తున్నారు..
కాగా, హుజూర్నగర్ ఎన్నికల ప్రచారంలో సత్యవతి రాథోడ్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరపున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ ప్రజలను కోరుతున్నారు. ఆమె ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.
కాంగ్రెస్ అభ్యర్థిపై ఆగ్రహం
ఎన్నికల ప్రచారంలో ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై సత్యవతి రాథోడ్ విమర్శల వర్షం కురిపించారు. ఒక మహిళను ఓడించడానికి ఇంత మంది వస్తున్నారని అంటున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి.. ఆనాడు తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మీద పోటీకి దిగినప్పుడు ఆ తెలివేమైందని మండిపడ్డారు.
శంకరమ్మను కుట్రలతో ఓడించిన ఆమె భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు వారించలేదని ప్రశ్నించారు. ఉత్తమ్ దంపతులు ఆరోజు ఓ మహిళను ఓడగొట్టి.. ఈరోజు నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒడిదుడుకుల ప్రయాణం..
సత్యవతి రాథోడ్ రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న నాయకురాలు. సర్పంచ్ స్థాయి నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె.. తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేబినెట్ విస్తరణలో భాగంగా మంత్రి పదవిని చేపట్టారు. వరంగల్ జిల్లా కురవి మండలంలోని గుండ్రాతిమడుగులో 1969, అక్టోబర్ 31న లింగ్యానాయక్, దశమి దంపతులకు సత్యవతి రాథోడ్ జన్మించారు. అక్కడే ఆమె ఏడవ తరగతి వరకు చదివారు. ఆ తర్వాత 1982, మే 5న గోవింద రాథోడ్తో సత్యవతి వివాహం జరిగింది. వీరికి సునీల్, సతీష్ అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. కాగా, 2009, జులై 20న గోవింద్ రాథోడ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భర్త మరణంతో కుటుంబ బాధ్యతలను కూడా తానే తీసుకున్నారు సత్యవతి రాథోడ్.
సర్పంచ్ స్థాయి నుంచి..
రాజకీయ ప్రస్థానం గురించి ప్రస్తావించుకున్నట్లయితే.. సత్యవతి 1984లో రాజకీయ ప్రవేశం చేశారు. 1985లో జిల్లా తెలుగు మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1988-1991 వరకు పంచాయతీ రాజ్ పరిషత్ సభ్యురాలిగా పనిచేసింది. 1996లో గుండ్రాతిమడుగు సర్పంచ్గా పనిచేశారు. 1989లో టీడీపీ తరపున సత్యవతి రాథోడ్.. కాంగ్రెస్ తరపున డీఎస్ రెడ్యా నాయక్ పోటీ చేయగా.. రెడ్యా నాయక్ గెలుపొందారు. 2007లో నర్సింహులపేట జడ్పీటీసీగా కూడా ఆమె పనిచేశారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున సత్యవతి రాథోడ్.. కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్యా నాయక్, బీజేపీ నుంచి పరశురాం నాయక్, ప్రజారాజ్యం పార్టీ నుంచి బానుతో సుజాత పోటీ చేయగా.. సత్యవతి రాథోడ్ గెలుపొందారు. 2009-14 వరకు ఆమె డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2014లో టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు సత్యవతి రాథోడ్. ప్రస్తుతం శాసనమండలి సభ్యురాలిగా ఉన్న సత్యవతి రాథోడ్ను తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు ఇటీవల మంత్రివర్గ విస్తరణలో భాగంగా రాష్ట్ర కేబినెట్లోకి తీసుకున్నారు.