భూస్కాంలో తెరపైకి సిఎంఓ: డిగ్గీకి తలసాని లీగల్ నోటీసులు
మియాపూర్ భూ కుంభకోణంలో తన పాత్ర ఉందంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆరోపించడాన్ని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణంలో తన పాత్ర ఉందంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆరోపించడాన్ని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు.తన పరువుకు భంగం కలిగించేలావ్యాఖ్యానించింనందుకుగాను రూ.10 కోట్లకు లీగల్ నోటీసును పంపారు. అంతేకాదు మహంకాళి పోలీస్ స్టేషన్ లో ఆయన దిగ్విజయ్ పై ఫిర్యాదు చేశారు.
మియాపూర్ ఘటనలో తనకు గానీ, తన కుటుంబానికి హస్తం ఉందని రుజువుచేయాలని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.ఈ మేరకు శుక్రవారం నాడు ఆయన సచివాలయంలో ఆయన మాట్లాడారు.
మియాపూర్ భూ కుంభకోణం రాజకీయరంగు పులుముకొంటుంది. ఈ కేసులో మంత్రి తలసానికి ప్రమేయం ఉందని కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలపై టిఆర్ఎస్ కూడ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.
ఈ కుంభకోణానికి సంబంధించి అధికారుల పాత్రతో పాటు, ముఖ్యమంత్రి కార్యాలయంపై కూడ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.వాస్తవాలు బయటకు రావాలంటే సిబిఐ విచారణ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
దిగ్విజయ్ కు లీగల్ నోటీసులు
దిగ్విజయ్ కు పదికోట్లకు పరువునష్టం దావాకు సంబందించిన లీగల్ నోటీసును పంపినట్టు చెప్పారు.బాధ్యతగల నాయకులు ఏం తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదన్నారు తలసాని.చిల్లర నాయకులు మాట్లాడబోనని చెప్పారు. పదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రకంగా తప్పుడు ప్రకటనలు చేయడం సరైందికాదన్నారు.అందుకే లీగల్, క్రిమినల్ చర్యలు తీసుకొంటామని ఆయన చెప్పారు.
నా చరిత్ర అందరికీ తెలుసు
25 ఏళ్ళకు పైగా తాను రాజకీయాల్లో ఉన్నానని తన చరిత్ర అందరికీ తెలుసునని చెప్పారు. తమకు ప్రజలే అధినాయకులని తలసాని చెప్పారు. రాష్ట్ర ప్రబుత్వ సమగ్రాభివృద్ది కోసం తాము పనిచేస్తున్నట్టు చెప్పారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు అవాకులు చవాకులు పేలడాన్ని మానుకోవాలని ఆయన హితవు పలికారు.కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.తనపై పోటీచేసి ఓటమిపాలైన వ్యక్తి చిల్లర రాజకీయాలకు పాల్పడితే ఊరుకొన్నానని చెప్పారు. కానీ, తన పరువుకు భంగం కల్గించేలా వ్యవహరిస్తే ఊరుకొనేది లేదన్నారు తలసాని
మియాపూర్ భూ కుంభకోణంలో సిఎంఓ పేషీ
గోల్డ్ స్టోన్ ప్రసాద్ అనే వ్యక్తి మరదలు శాంతికుమారి. ఆమె ఐఎఎస్ అధికారి, ఆమె సిఎంఓ లో పనిచేస్తున్నారని శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ పక్షనాయకుడు షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. సిబిఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు.తన కార్యాలయంలోని అధికారులకు ఈ కుంభకోణాలతో ఎలాంటి పాత్ర లేదని నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు షబ్బీర్ అలీ. డిప్యూటీ సిఎం వద్ద ఓఎస్ డి గా పనిచేస్తున్న జాన్ వెస్లీ గతంలో కెసిఆర్ రవాణాశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన వద్ద పిఎగా ఉన్నాడని ఆయన ఆరోపించారు.అంతేకాదు హరీష్ రావు వద్ద కూడ పనిచేశాడని చెప్పారు. జాన్ వెస్లీని కెసిఆర్ తన ఇంట్లో మనిషిగా భావిస్తాడని షబ్బీర్ అలీ ఆరోపించాడు.అందుకే ప్రస్తుతం డిప్యూటీ సిఎం మహమూద్ అలీ వద్ద నియమించారన్నారు.
తనకు ఎలాంటి సంబంధం లేదు
అయితే కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపై డిప్యూటీ సిఎం మహమూద్ అలీ ఓఎస్ డీ జాన్ వెస్లీ ఖండించారు.ఈ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఈ ఆరోపణలపై ఆయన ఓ తెలుగున్యూస్ చానల్ తో మాట్లాడారు. భూ కుంభకోణంలో గానీ, ఇతర అవినీతి వ్యవహరాల్లో కూడ తన ప్రమేయం లేదన్నారు. తాను అంత పెద్ద స్థాయి వ్యక్తిని కూడ కాదన్నారు వెస్లీ.