సంక్రాంతి ఆనవాయితీ.. తలసాని ఈ సారి కూడా మిస్ అవట్లేదు..
సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది ఆంధ్రా.. అందులోనూ కోనసీమ ప్రాంతంలో సంక్రాంతి సందడి మామూలుగా ఉండదు. అందుకే సంక్రాంతి పండుగకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్రాకు వెళ్లేవారు చాలామంది ఉంటారు. అక్కడి రుచులను ఆస్వాదించేందుకు.. పనిలో పనిగా కోడి పందేలను వీక్షించేందుకు చాలామంది అక్కడికి వెళ్తారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రతీ ఏటా సంక్రాంతి పండుగకు భీమవరం వెళ్తారు.
ఈ ఏడాది కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తూ సంక్రాంతి వేడుకల కోసం భీమవరం వెళ్లనున్నారు. నేడు భీమవరంలో జరిగే భోగి వేడుకలతో పాటు రేపు సంక్రాంతి వేడుకల్లోనూ ఆయన పాల్గొంటారు. అలాగే సరదాగా కోడి పందేలను కూడా వీక్షిస్తారని ఆయన అనుచరులు తెలిపారు. తలసాని రాకతో భీమవరంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.
కాగా, తెలుగు లోగిళ్లన్నీ సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. పండుగ పూట ఆడపడుచులు తెలుగుదనం ఉట్టిపడే చీరల్లో, మగవాళ్లు పంచెకట్టులో కనిపిస్తున్నారు. నేడు భోగి పర్వదినం కావడంతో.. ఎక్కడ చూసినా భోగి మంటలే కనిపిస్తున్నాయి. చిన్నా-పెద్దా తేడా లేకుండా అంతా భోగి మంటల చుట్టూ చేరి వెచ్చదనం పొందుతున్నారు.
ముఖ్యంగా చిన్నారులకు భోగి పళ్లు పోసే తంతు చాలా కుటుంబాల్లో సందడి నింపుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు,కర్ణాటకల్లోనూ ఈ పండుగను జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో సంక్రాంతి సందడి ఎక్కువ. కోడి పందేలు సంక్రాంతి పండుగకు అక్కడ అదనపు శోభ.
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కోడిపందేల కోసం పందెం రాయుళ్లు కోట్లాది రూపాయాలతో రంగంలోకి దిగుతున్నారు. కృష్ణా,గోదావరి జిల్లాల్లో ఇప్పటికే యథేచ్చగా కోడి పందేలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కోడిపందేలపై ఆంక్షలు ఉన్నా.. ప్రజలెవరూ వాటిని లెక్క చేయడం లేదు. కోడి పందేలను నియంత్రించేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కావడం లేదు.
ముందస్తు బైండోవర్ కేసులు పెట్టినా అవేవీ ప్రభావం చూపలేకపోయాయి. పక్క రాష్ట్రాల నుంచి కూడా లక్షల రూపాయాలతో పందెం రాయుళ్లు దిగుతున్నట్టు తెలుస్తోంది. నేడు భోగి కావడంతో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కోడి పందేలపై ఓ కన్నేసి ఉంచడంతో పాటు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.