ముమ్మాటికి అక్రమ ప్రాజెక్టులే: ఏపీ సర్కారుపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శలు
హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం, నాయకులపై మరోసారి విమర్శలు గుప్పించారు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. గురువారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని కృష్ణా బోర్డు ఏపీ ప్రభుత్వానికి ఆదేశించిందన్నారు. డీపీఆర్ లేకుండా ప్రాజెక్టును కట్టవద్దని బోర్డు స్పష్టంగా చెప్పిందని మంత్రి వేముల తెలిపారు. బోర్డు ఆదేశాలతో ఈ ప్రాజెక్టు అక్రమమని తేలిపోయిందన్నారు. దీనిపై ఏపీ నాయకులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
రాయలసీమ ఎత్తిపోతలను కట్టొద్దని హరిత ట్రైబ్యునల్ చెప్పిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కృష్ణా బోర్డు ఆదేశాల ప్రకారం నిబంధనలకు లోబడి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపేయాలని ఏపీ ప్రభుత్వాన్ని మంత్రి డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన వారంలోనే కృష్ణా బోర్డును ఆశ్రయించామని, గత జులై 25న మరోసారి బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత కేంద్రం, కృష్ణా బోర్డుకు ఏడు లేఖలు రాసినట్లు మంత్రి వివరించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపైనా విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధికోసం అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం నాలుగురేట్లు పెంచింది కాంగ్రెస్ హయాంలో కాదా? అని ప్రశ్నించారు.
వైయస్సార్ సీమకు నీళ్లు తీసుకెళ్తుంటే డీకే అరుణ హారతి పట్టారని అన్నారు. ఏపీ ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోరాటం చేయడం లేదని నిలదీశారు మంత్రి వేముల. బీజేపీ నేతలు మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. కాగా, ఇటీవల ఏపీ నాయకులుపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. లంకలో పుట్టినవారంతా రావణాసురులేనంటూ దుయ్యబట్టారు.