ఆత్మహత్యలు కొత్తేం కాదు!, మీ వల్లే: తెలంగాణ మంత్రులు
హైదరాబాద్: రైతుల ఆత్మహత్యల పైన తెలంగాణ రాష్ట్ర మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావులు బుధవారం నాడు స్పందించారు. రైతు ఆత్మహత్యలు కొత్తేమీ కాదని, కాంగ్రెస్, టిడిపి హయాంలో కూడా 23వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అభిప్రాయపడ్డారు.
ప్రతిపక్షాలు రైతు ఆత్మహత్యలను అడ్డం పెట్టుకొని శవ రాజకీయాలు చేస్తున్నాయని తుమ్మల మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. అధికారం కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతున్నారన్నారు. వాణిజ్య పంటల సాగు మొదలైనప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయన్నారు.
గత ప్రభుత్వాలు రైతులను ఏనాడు పట్టించుకోలేదన్నారు. మనోధైర్యం కల్పించాల్సిన పార్టీలు రైతులను కృంగదీస్తున్నాయన్నారు. ఎవరు మంచోళ్లు అనుకుంటే వాళ్లను ప్రజలు అధికారంలోకి తెస్తారన్నారు. రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఏనాడు రైతులు విత్తనాలు, ఎరువుల కోసం రోడ్డెక్కలేదన్నారు. బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు ఇప్పిస్తున్నామన్నారు. రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.
తెలంగాణపై మొదటి నుంచి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలది సవతి తల్లి ప్రేమ అని పోచారం దుయ్యబట్టారు. తెలంగాణలో రైతాంగం పరిస్థితి ఇంత దారుణంగా ఉండటానికి ఆ రెండు పార్టీలే కారణమన్నారు. మీ పాలనలో రైతాంగానికి ఎన్నడైనా సగం కరెంట్ ఇచ్చారా అని ప్రశ్నించారు.
రైతుల ఆత్మహత్యలు బాధాకరమని, ఇప్పటికీ 162 మందికి ఎక్స్గ్రేషియా ఇచ్చామన్నారు. ఇంకా కొన్ని విచారణలో ఉన్నాయన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఇచ్చి పరిహారం పెంచాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. కమీషన్ల కోసమే కాంగ్రెస్ పార్టీ నేతలు కాలువలు తవ్వించారన్నారు. తెలంగాణలో.. రైతుల ఆత్మహత్యలు కొత్తగా జరుగుతున్నట్లు చిత్రీకరిస్తున్నారన్నారు.