టీఆర్ఎస్ బాస్గా మళ్లీ కేసీఆర్: కేటీఆర్ పట్టాభిషేకానికి బ్రేక్: 2023 ఎన్నికల సారథిగా..!
హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మరోసారి ఎన్నిక కానున్నారు. ఆయన ఎన్నిక ఇక లాంఛనప్రాయమే. పార్టీ అధ్యక్ష పదవి కోసం నిర్వహించనున్న ఎన్నికల సందర్భంగా కేసీఆర్ తరఫున నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. కేసీఆర్ తరఫున మంత్రులు వాటిని సమర్పించారు. మరో నామినేషన్ దాఖలు అయ్యే అవకాశాలు దాదాపుగా ఉండకపోవచ్చు. నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ఈ నెల 22వ తేదీ వరకు గడువు ఉంది.
నామినేషన్ వేసిన మంత్రులు
తెలంగాణ భవన్లో- ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి కేసీఆర్ పేరును మహమూద్ అలీ ప్రతిపాదించారు. మిగిలిన మంత్రులు బలపరిచారు. మరోసారి టీఆర్ఎస్ చీఫ్గా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఖాయమైంది.
25న ఎన్నిక..
టీఆర్ఎస్ అధ్యక్ష పదవి కోసం ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. రిటర్నింగ్ అధికారి ఎం శ్రీనివాస్ రెడ్డి ఈ షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ నెల 22వ తేదీ వరకు నామినేషన్ పత్రాల స్వీకరణ ఉంటుంది. ఆ మరుసటి రోజు ఉదయం 11 గంటలకు నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి తుది గడువు 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. ఇక 25వ తేదీన మాదాపూర్ హైటెక్స్లో నిర్వహించే పార్టీ ప్లీనరీలో అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.
మరొకరు నామినేషన్ వేస్తారా?
ప్రతిరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తెలంగాణ భవన్లో నామినేషన్లు స్వీకరించునున్నారు. కేసీఆర్ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడంతో మరొకరు పోటీ పడతారా? లేదా? అనేది తేలాల్సి ఉంది. ఇంకా అయిదురోజుల గడువు ఉంది. ఈలోగా మరెవరైనా టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తారనేది అనుమానమే. నామినేషన్ దాఖలు కావడమంటూ జరిగితే ఎన్నికలను నిర్వహించే పరిస్థితి తలెత్త వచ్చు. ప్రస్తుతానికి ఆ అవకాశం లేనట్టేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రెండు ఘన విజయాలు..
2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ ఇక కేసీఆర్ సారథ్యంలోనే సన్నద్ధమౌతుంది. వరుసగా రెండుసార్లు పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఉద్యమ నాయకుడిగా కేసీఆర్కు పేరు ఉంది. 20214, 2018 నాటి మధ్యంతర ఎన్నికల్లో టీఆర్ఎస్.. కేసీఆర్ సారథ్యంలోనే అవలీలగా గెలిచింది. వరుసగా రెండు ఘన విజయాలను అందుకుంది. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు, నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో విజయవంతంగా పరిపాలనను సాగిస్తోంది.
ఈ దఫా టఫ్
2023 నాటి ఎన్నికలు మాత్రం అగ్ని పరీక్షను పెట్టే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. దీనికి కారణం- ప్రత్యామ్నాయ పార్టీలు బలపడుతుండటమే. సిద్ధిపేట్ జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమిపాలైంది. భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని అందుకుంది. ఆ తరువాత- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఇక్కడ కూడా బీజేపీ తన సత్తా చాటింది.
అటు కాంగ్రెస్ కూడా..
అటు కాంగ్రెస్ కూడా క్షేత్రస్థాయిలో బలాన్ని పుంజుకోవడానికి పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తోంది. ప్రత్యేకించి- మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడు రేవంత్ రెడ్డికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు అందిన తరువాత.. జోరందుకుందా పార్టీ. ఏదో ఒక అంశం మీద జనంలో ఉండేలా రాజకీయ ప్రణాళికలను రూపొందించుకుంది హస్తం పార్టీ. మరోవంక వైఎస్ షర్మిల రూపంలో కొత్త పార్టీ ఆవిర్భవించడం టీఆర్ఎస్కు రాజకీయంగా మరింత ఇబ్బందులను గురి చేసే విషయంగా భావిస్తున్నారు విశ్లేషకులు.
కేటీఆర్కు ఇప్పట్లో లేనట్టే..
ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మరోసారి కేసీఆర్కే పార్టీ పగ్గాలను అందించాలంటూ టీఆర్ఎస్ నాయకులు తీర్మానించుకున్నారు. నిజానికి- కేసీఆర్ కుమారుడు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు ఈ దఫా పార్టీ పగ్గాలను అప్పగించే అవకాశాలు ఉన్నాయంటూ ఇదివరకు వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పని చేస్తోన్నారు. మారిన రాజకీయ పరిస్థితులు, కారణాల వల్ల దీన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టే కనిపిస్తోంది.