యధా రాజా తధా ప్రజా ... సామాజిక దూరం పాటించని మంత్రులు ,ఎమ్మెల్యేలు .. ఇక ప్రజలు అంతే !!
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా మహమ్మారి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి సామాజిక దూరం ఒక్కటే మార్గమని ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్లుగానే అవుతున్నాయి. ఇక పాలకులే సామాజిక దూరం పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉంటే,సామాన్య ప్రజల మాటేమిటి అన్నది ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ధూల్ పేటలో నిశ్చితార్ధం ధూమ్ ధామ్.. 15 మందికి కరోనా పాజిటివ్
సామాజిక దూరం పాటించాలని చెప్పే మంత్రులే సోషల్ డిస్టెన్స్ మరచిన వైనం
కరోనా కష్టకాలంలో విధించిన లాక్ డౌన్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని భావించి ప్రజా ప్రతినిధులు రంగంలోకి దిగారు. వారికి నిత్యావసర వస్తువుల అందించడానికి, ఎవరికి వారు తీవ్రంగా కృషి చేశారు. నిత్యావసర వస్తువులను అందించే మాట అటుంచి,ఇక తెలంగాణ మంత్రులు,ఎమ్మెల్యేలు ఎవరు ఏ చిన్న కార్యక్రమం పెట్టినా తండోపతండాలుగా జనాలు రావడం, సామాజిక దూరాన్ని పక్కనపెట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిపోతున్నాయి. ఇక వేదికలపైన సామాజిక దూరాన్ని పాటించాలి అని చెప్పిన మంత్రివర్యులు కూడా కనీస దూరం పాటించకపోవడం గమనార్హం.
గుంపులుగా ఫోటోలు దిగడం, ప్రచార ఆర్భాటాలు కోసం వెంపర్లాడటం
అందరూ మాస్కు ధరించాలి, సామాజిక దూరం పాటించాలి, కనీసం ఒకరికి ఒకరికి మధ్యలో రెండు అడుగుల దూరం అయినా ఉండేలా చూసుకోవాలి అని హితబోధ చేస్తున్న తెలంగాణ మంత్రులు , ఎమ్మెల్యేలు, గుంపులుగా ఫోటోలు దిగడం, ప్రచార ఆర్భాటాలు కోసం వెంపర్లాడటం కరోనా లాక్డౌన్ సమయంలో అందరికీ కనిపిస్తున్న వాస్తవం . సామాజిక దూరం పాటించాలి అనే కనీస నియమాన్ని కూడా చాలా మంది తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు అమలు చేయలేకపోయారు. ఇక తాజాగా సామాజిక దూరాన్ని పాటించని వ్యవహారంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
నిత్యావసర సరుకుల పంపిణీలో సామాజిక దూరం పాటించలేదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యేపై కేసు
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తన నియోజకవర్గం లోని 25 డివిజన్లలో ఉన్న పేదలకు నిత్యావసర వస్తువులను అందించే ఒక కార్యక్రమంలో లాక్ డౌన్ నిబంధనలు పాటించలేదని సమాచారం . దాదాపుగా మూడు వేల మందికి నిత్యావసరాల పంపిణీ చేసిన నన్నపనేని నరేందర్ అక్కడ ప్రజలు కనీస సామాజిక దూరం పాటించకపోవడం, వారిని పాటించేలా చూడకపోవడం తో ,లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద ఆయనపై కేసు నమోదైంది. వరంగల్ అర్బన్ జిల్లా బిజెపి నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, వారందించిన ఫోటోలు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక కరోనాను మరిచి మార్కెట్లు , మాంసాహార విక్రయ కేంద్రాల వద్ద గుంపులుగా జనం
ఒక్క ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది సామాజిక దూరం పాటించకుండా పర్యటనలు చేస్తున్నారు. ప్రజలకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తున్నారు. పలు కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఇక పాలకులే సామాజిక దూరం పాటించినప్పుడు సామాన్య ప్రజలు ఏ విధంగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. నిత్యం కూరగాయల మార్కెట్ వద్ద, మాంసాహార విక్రయ కేంద్రాల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించకుండా కరోనా విషయాన్ని మర్చిపోయి తిరుగుతున్న పరిస్థితులున్నాయి.
Recommended Video
పాలకులు మారితేనే ప్రజల్లో మార్పు తీసుకురావటం సాధ్యం
సూపర్ మార్కెట్లలో సామాజిక దూరం పాటించకపోతే సీజ్ చేస్తున్న అధికార యంత్రాంగం, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రజాప్రతినిధుల విషయంలో సామాజిక దూరం పాటించకపోయినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. సామాన్య ప్రజలను కరోనా మహమ్మారి విషయంలో అప్రమత్తం చేసి, వారిలో అవగాహన కల్పించి, సామాజిక దూరం పాటించేలా చేయాల్సిన మంత్రివర్యులు, ఎమ్మెల్యే లే సామాజిక దూరం పాటించకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలంగాణ రాష్ట్రంలో నిత్యం అనేకచోట్ల కనిపిస్తుంది. ఇప్పటికైనా ముందు పాలకులు మారాలి .. తర్వాత ప్రజలను మారేలా చేయాలి. సామాజిక దూరం పాటించాలి. లేకుంటే ఎవరెన్ని చేసినా, ఎవరెంత చెప్పినా యధా రాజా తథా ప్రజా.