ఘాటైన పాటలు: తెలంగాణ మిర్చి రేడియో(ఫొటో)
హైదరాబాద్: ‘స్వీట్ మాటలు.. ఘాటైన పాటలు'తో కూడిన తెలంగాణ మిర్చి రేడియో ఆవిష్కరణోత్సవం నగరంలోని రవీంద్రభారతిలో సోమవారం సాయంత్రం ఘటన జరిగింది. శాసనమండలి ఛైర్మన్ కె స్వామిగౌడ్, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్లు హాజరై తెలంగాణ మిర్చి రేడియో లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ.. మిర్చి రేడియో తెలంగాణ భాష గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలన్నారు. శ్రోతలకు పాటలు, మాటలతోపాటు సేవా కార్యక్రమాలను తెలంగాణ మిర్చి కొనసాగించాలన్నారు.
డాక్టర్ సి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ మాండలిక పదాల గొప్పతనాన్ని ప్రసార మాద్యమం ప్రపంచానికి చాటాలని అన్నారు. ఉద్యమ ఫలితంగా వచ్చిన సాహిత్యాన్ని, పాటలను, సేకరించి గ్రంథాలుగా రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
రేడియో ఛైర్మన్ అద్వైత రాం మాట్లాడుతూ.. నిరంతర విలక్షణమైన కార్యక్రమాలతో ప్రపంచంలోని తెలుగువారందరినీ ఆనందపరుస్తామని అన్నారు. ఈ సందర్భంగా రేడియో జాకీలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట, మాట, పాటలు ఆహుతులను అలరించాయి.