ఆ పదవిపై పెదవి విరుపు..! నువ్విస్తానంటే నేనొద్దంటున్నా..! తెలంగాణ సర్కార్ లో నయా ట్విస్ట్
హైదరాబాద్ : బంపర్ మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్ లో కేబినెట్ పదవులకు డిమాండ్ చాలానే ఉంది. 90 మందిలో కేవలం 18 మంది వరకే చోటు దక్కనుండటంతో ఎవరికి పదవులు వస్తాయో అన్నది ఉత్కంఠగా మారింది. ఈనేపథ్యంలో పిలిచి పదవి ఇస్తామంటే వద్దంటున్నారు కొందరు. పార్టీ పెద్దలు బుజ్జగిస్తున్నా కూడ నో నో అంటున్నారట.
మంత్రివర్గ విస్తరణపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో.. శాసనసభ స్పీకర్ ఎంపిక క్లిష్టతరంగా మారింది. పార్టీ సీనియర్లంతా ఈ పదవి అంటేనే జంకుతున్నారట. దీంతో శాసనసభాపతిగా ఎవరు ఖరారు కానున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.
మాకొద్దు ఈ పదవి..!
మంత్రివర్గ విస్తరణపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు కేసీఆర్. కాస్తా ఆలస్యమైనా సమర్థవంతులను మంత్రులుగా సెలెక్ట్ చేయాలన్నది ఆయన అంతరంగంగా కనిపిస్తోంది. ఈక్రమంలో శాసనసభ స్పీకర్ ఎవరన్నది డైలామాగా మారింది. తెలంగాణ తొలి ప్రభుత్వంలో స్పీకర్ గా పనిచేసిన మధుసూదనాచారి ఈసారి ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో.. ఆ స్థానంలో మరొకర్ని తీసుకోవాల్సి ఉంది. అసెంబ్లీ వ్యవహారాలు నడపడంలో ఈ పదవి కీలకం కానుండటంతో కేసీఆర్ కొందరి పేర్లు పరిశీలించినట్లు తెలిసింది. మాజీమంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి తో పాటు రెడ్యానాయక్.. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కొప్పుల ఈశ్వర్, డాక్టర్ సంజయ్ కుమార్.. మహబూబ్ నగర్ జిల్లా నుంచి మరొక ఎమ్మెల్యే.. ఇలా వీరిలో ఎవరో ఒకరిని స్పీకర్ పదవికి ఎంపిక చేయొచ్చనే చర్చ జరుగుతోంది. అదలావుంటే స్పీకర్ పదవి కోసం ఈటల రాజేందర్ పేరు ఖరారైనట్లు ఇటీవల చర్చ జరిగింది. అయితే ఆయన డైరెక్ట్ గా కేసీఆర్ తో మాట్లాడి సున్నితంగా తిరస్కరించారనే టాక్ వినిపిస్తోంది.
స్పీకర్ పదవిపై పెదవి విరుపు
వాస్తవానికి మంత్రుల కంటే కూడా స్పీకర్ పదవికి అత్యున్నత స్థానముంది. మంత్రుల కంటే కూడా అధికారాలు ఎక్కువే. ఇక సీఎం తర్వాతి స్థానంలో శాసనసభాధిపతియే ఉంటారు. చాలా సందర్భాల్లో మంత్రి పదవి దక్కనివారు స్పీకర్ పదవికి మొగ్గు చూపుతారు. కానీ ఈసారి తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ పోస్ట్ అంటే జంకుతున్నారు. ఇప్పటివరకు ఆ పదవి కోసం గులాబీ పెద్దలు పరిశీలించినవారంతా కూడా నో చెబుతున్నారట. వారి భయానికి ఒకటే కారణంగా కనిపిస్తోంది. స్పీకర్ పదవి నిర్వహించినవారు ఎవరూ కూడా మళ్లీ గెలిచిన దాఖలాలు లేవు. అందుకే ఆ పదవి ఇస్తామంటే వద్దు బాబోయ్ అంటున్నారట. ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి తెలంగాణ రాష్ట్రం వరకు.. ఇంతకుముందు స్పీకర్లుగా పనిచేసినవారు ఎవరూ కూడా తదుపరి ఎన్నికల్లో గెలవలేదు. శ్రీపాదరావు, ప్రతిభా భారతి, కేఆర్ సురేశ్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, మధుసూదనాచారి.. ఇలా ఎవరూ కూడా ఆ పదవిలో కూర్చున్న తర్వాత మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితులు లేవు.
చివరకు ఎవరికి దక్కేనో?
స్పీకర్ పదవికి ఎవరూ ముందుకు రాని తరుణంలో గులాబీ పెద్దలకు ఈ అంశం కత్తిమీద సాములాగా తయారైంది. అయితే కేసీఆర్ జాతీయ స్థాయి పర్యటన తర్వాత ఈ అంశం కొలిక్కి వచ్చే ఛాన్సుందంటున్నారు పార్టీశ్రేణులు. స్పీకర్ ఎంపిక తర్వాతే మంత్రివర్గం విస్తరించాలని తొలుత భావించినా.. కేసీఆర్ వచ్చాక ముందుగా కేబినెట్ విస్తరణ చేయనున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ పదవి అంటే జంకుతున్న ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎలా బుజ్జగిస్తారో.. ఆ పదవి ఎవరికి కట్టబెడతారో అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్.