పేదల ఆకలి తీర్చటమే నిజమైన ఛాలెంజ్... 'గో హంగర్ గో' అంటూ ఎమ్మెల్యే సీతక్క సవాల్ !!
ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్ సీతక్క ప్రజా ప్రతినిధి అన్న పదానికి సరైన నిర్వచనంగా నిలిచారు. లాక్ డౌన్ తో తిప్పలు పడుతున్న ములుగు నియోజక వర్గ గూడేలలో ఆదివాసీల ఆకలి బాధలు తీర్చటానికి ఎండను సైతం లెక్క చెయ్యక కష్టపడుతున్నారు. సామాన్యుల్లో సామాన్యురాలిగా , గిరిజనుల కష్టాలు తెలిసిన అక్కగా , ప్రస్తుతం ములుగు ఎమ్మెల్యేగా ఆమె అందిస్తున్న సేవలు అనిర్వచనీయం . ట్రాక్టర్లు, బండ్లు , కాలినడక ఇలా ఏది అవకాశం ఉంటె అలా ప్రయాణిస్తున్నారు. గూడేల్లో వాళ్ళ మంచాల మీదే సేద తీరుతున్నారు.
పేదల ఆకలి తెలిసిన సీతక్క కొత్త ఛాలెంజ్
వీరోచితంగా తన నియోజకవర్గ ప్రజల కోసం పోరాటం సాగిస్తున్న సీతక్క తెలంగాణా రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు ఒక మార్గదర్శిగా నిలిచారు. కష్ట కాలంలో ఏంచెయ్యాలి.. ఎలా చెయ్యాలి అంటే అది సీతక్కను చూసి తెలుసుకోవాలని అంతా అనుకునేలా చేశారు . ఇప్పటికే పేదల ఆకలి తీర్చాలని , గిరిజన గూడేల్లో వారికి సహాయం అందించటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇక ఇదే సమయంలో పేదల ఆకలి తెలిసిన సీతక్క తాజాగా కొత్త ఛాలెంజ్ విసిరారు.
మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలకు, గుత్తికోయలకు అండగా
నిత్యావసరాలు దొరక్క ఇబ్బందిపడుతున్న గిరిజనుల కష్టాలు తీర్చటానికి నడుం బిగించిన సీతక్క ఉదయం నుండి రాత్రి వరకు గిరిజన గూడేల్లో పర్యటిస్తూ గిరిజనుల ఆకలి తీరుస్తున్నారు. మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలకు, గుత్తికోయలకు ఆమె సహాయం అందిస్తున్నారు .లాక్డాన్ అమల్లోకి వచ్చినప్పట్టి నుంచి తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. రాత్రి 10 గంటల వరకు కూడా ఆమె నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నారు.
పేద వారి ఆకలి తీర్చేందుకు సరికొత్త ఛాలెంజ్.. గవర్నర్ తో పాటు వారికి
ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్న సీతక్క పేద వారి ఆకలి తీర్చేందుకు సరికొత్త ఛాలెంజ్ తో ముందుకొచ్చారు. #GoHungerGo పేరుతో ఛాలెంజ్ విసిరారు సీతక్క . కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదవారి ఆకలి తీర్చాలని ఆమె ఛాలెంజ్ చేశారు . మొదట ఈ ఛాలెంజ్ ను సీతక్క గవర్నర్ తమిళిసై, ఎంపీ రేవంత్రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీకి విసిరారు. మీరు తప్పకుండా చేస్తారని భావిస్తాను వేరే వాళ్ళకి కూడా ఛాలెంజ్ చేస్తారని నమ్ముతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు సీతక్క. ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులకు , రాహుల్ గాంధీకి కూడా ట్యాగ్ చేశారు.
Recommended Video
పేదలను గుర్తించి వారికి ఒక పూట భోజనం పెట్టాలని ఛాలెంజ్
ఇక అంతే కాదు లాక్డౌన్ సందర్భంగా ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఒక పూటైనా భోజనం పెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క నెటిజన్లకు సైతం ఈ ఛాలెంజ్ చేసి చెప్పారు. ఈ చాలెంజ్ను స్వీకరించిన వారు పేదలను గుర్తించి వారికి ఒక పూట భోజనం పెట్టాలి. వీలైతే వారికి అవసరమైన నిత్యావసర వస్తువులనూ సమకూర్చాలి. ఈ ఛాలెంజ్ను స్వీకరించి పూర్తి చేసిన వారు సామాజిక మాధ్యమాల్లో ‘గో హంగర్ గో' అని పోస్టు చేసి తోటి వారికి చాలెంజ్ను విసరాలి అని సీతక్క పేదల ఆకలి తీర్చటానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు . మరి ఈ ఛాలెంజ్ కు రెస్పాన్స్ ఎలా వస్తుందో వేచి చూడాలి .