భారీ హైక్: తెలంగాణలో ఎమ్మెల్యేల జీతం రూ.3.5 లక్షలుగా పెంపు?
హైదరాబాద్: దేశంలోనే రెండో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల పెంపునకు అసెంబ్లీ వసతుల కమిటీ సిఫారసు చేసింది. దీనిపై సోమవారం అసెంబ్లీ కమిటీహాలులో స్పీకర్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్లతో సహా మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్, ఆయా పార్టీల శాసనసభాపక్ష నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో సభ్యుల జీత భత్యాలను రూ.1.25 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు పెంచే విధంగా కమిటీ సిఫారసు చేసింది.
దీంతో పాటు ప్రస్తుతం సభ్యులకు ఇస్తున్న వెహికల్ లోన్ను రూ. 15 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచేలా కమిటీ సిఫారసు చేసింది. ఇక మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పింఛను రూ.50 వేల నుంచి రూ.65 వేలకు పెంచనున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మరణిస్తే, వారి మరణాంతరం వారి భార్యలకు కూడా ఇదే సౌకర్యాలను కల్పించాలని పేర్కొంది.
అంతేకాకుండా పీఏల వేతనం కూడా రూ.25 వేలు పెంచాలంది. ఆదర్శనగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ పనిలో జాప్యంపై కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆర్అండ్బీ అధికారులు డిసెంబర్లోపు పనులు పూర్తిచేస్తామన్నారు. దీనికి తోడు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇళ్ల స్థలాలు కేటాయించే అంశం కూడా మరోసారి తెరపైకి వచ్చింది.
ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇళ్ల స్థలాలు కేటాయించిన విషయం తెలిసిందే. వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ అప్పట్లో పలు ప్రజాసంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అప్పటి నుంచి ఈ కేసు పెండింగ్లోనే ఉంది.
ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడం, 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇళ్ల స్థలాల అంశం మరోసారి చర్చకు వచ్చింది. దీనిపై అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కలిసి సంతకాలు సేకరించారు. దానిని ఇటీవలే సీఎం కేసీఆర్కు అందజేశారు.
కాగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇళ్ల స్థలాలు కేటాయించే అంశం న్యాయస్థానాల పరిధిలో ఉందని, ప్రభుత్వం ఏ మేరకు జోక్యం చేసుకోవచ్చు..? అందుకు ఏమేమి మార్గాలున్నాయో అన్వేషించాలని ఆయన ఎమ్మెల్యేలతో చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఉపసభాపతి పద్మాదేవేందర్రెడ్డి, చీఫ్విప్ కొప్పుల ఈశ్వర్, విప్ గొంగిడి సునీతల నేతృత్వంలో ఒక కమిటీని వేశారు. సోమవారం మధ్యాహ్నం స్పీకర్ మధుసూదనాచారి నేతృత్వంలో అసెంబ్లీ వసతుల కమిటీ సమావేశం జరిగింది.
ఈ కమిటీలో సభ్యుల జీతభత్యాల అంశంతోపాటు ఇళ్ల స్థలాలపైనా చర్చించారు. ఈ సమావేశంలో తమకు ఇస్తున్న నియోజకవర్గ అభివృద్ధి నిధులను కూడా పెంచాలన్న డిమాండ్ను ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ ముందుంచారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.