పెట్రోల్, గ్యాస్ ధరలు ఇంకా పెంచడానికే ఓటేయాలా? -బీజేపీపై మంత్రి హరీశ్ రావు ఫైర్
తెలంగాణలో గ్రాడ్యువేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఇంధన ధరల భగభగలు ప్రచారాస్త్రాలుగా మారాయి. రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను ప్రస్తావిస్తూ... వాటిని ఇంకాస్త పెంచడానికే బీజేపీకి ఓటేయమంటారా? అని టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వరంగల్ జిల్లా చేర్యాలలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు బీజేపీపై నిప్పులు చెరిగారు. నోరుంది కదాని తెలంగాణ బీజేపీ నేతలు ఏది పడితే అది మాట్లాడుతున్నారని, వాళ్లకు నిజంగా దమ్ముంటే, చేతనయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో మాట్లాడాలని సవాలు విసిరారు.
కేంద్రంలోని మోదీ సర్కారు వరుసగా ప్రభుత్వ సంస్థలను తెగనమ్ముతూ, ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతోందని, ఇప్పటికే బీఎస్ఎన్ ఎల్, రైల్వే, ఎల్ఐసీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని అమ్మే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ''ఈతోటి బీజేపీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలిపింది. అసలు వీళ్లకు ఓటెందుకు వేయాలి? ఉద్యోగాలు ఊడగొట్టినందుకా? లీటరు పెట్రోల్ రూ.100 చేసినందుకా? గ్యాస్, పెట్రోల్, డిజీల్ ధరలు ఇంకా పెంచడానికా?'' అని నిలదీశారు.
ఓవైపు ప్రభుత్వ సంస్థలను తెగనమ్ముతూ, నిత్యావసర ధరల్ని ఇష్టారీతిగా పెంచేస్తోన్న బీజేపీ సర్కారు ఇక ఎరువుల ధర కూడా పెంచబోతోందని, యాసంగి నాటికే ఎరువుల ధర పెంచాలని కేంద్రం డిసైడైందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఖమ్మం-నల్గొండ-వరంగల్ జిల్లాల గ్రాడ్యువేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి.. తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లొచ్చారని, రాష్ట్రం కోసం కృషి చేశారని మంత్రి హరీష్రావు గుర్తు చేశారు.