మున్సిపోల్స్లో ఉద్రిక్తతలు,ఘర్షణలు : టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి..
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. అక్కడక్కడా ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్లో టీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్య ఘర్షణలు చోటు చేుకున్నాయి. 32వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నారన్న కారణంతో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాస్.. టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్రాన్ ముక్కును కొరికేశాడు. దీంతో ఇమ్రాన్కు తీవ్ర రక్తస్రావం కాగా హుటాహుటిన బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన ఇలియాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముగిసిన పోలింగ్..
బుధవారం ఉదయం 7గం. నుంచి సాయంత్రం 5గం. వరకు పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 120 మున్సిపాలిటీలు, 9 కార్పోరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 50వేల మంది పోలీసులను మోహరించారు. ఈసారి ఎన్నికల్లో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ను ఉపయోగించారు. 120 మున్సిపాలిటీల్లో మొత్తం
20,14,600 పురుష ఓటర్లు, 20,25,760 మహిళా ఓటర్లు ఉండగా.. కార్పోరేషన్ల పరిధిలో 6,66,900 మంది పురుష ఓటర్లు, 6,48,232 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎంతమంది ఓటింగ్లో పాల్గొన్నారన్నది తెలియాల్సి ఉంది. మొత్తం 7961 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 1240 మంది ఎన్నికల పరిశీలకులను నియమించారు.
Recommended Video
ఉద్రిక్తతలు.. ఘర్షణలు..
మధ్యాహ్నం ఒంటిగంట వరకు 56శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5గంటల లోపు క్యూ లైన్లో వేచివున్నవారికి ఓటింగ్ అవకాశం కల్పిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలోని పోలింగ్ కేంద్రాల వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. నకిలీ ఓటర్ కార్డులతో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేతలను ఇద్దరిని పట్టుకుని చితకబాదారు.
టీఆర్ఎస్,బీజేపీ ఘర్షణలు
జగిత్యాలలోని 41వ వార్డులో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. 100మీ. నిబంధనను కార్యకర్తలు ఉల్లంఘించడంతో ఘర్షణ చోటు చేసుకున్నట్టు సమాచారం. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇక వికారాబాద్ జిల్లా తాండూర్లో మూడు పోలింగ్ కేంద్రాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఓటింగ్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీంతో తాండూరులో టీఆర్ఎస్,బీజేపీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
25న ఫలితాలు..
మెదక్ నర్సాపూర్,నల్గొండ చిట్యాల,రంగారెడ్డి జల్పల్లి,వరంగల్ పరకాల,కామారెడ్డి ఎల్చిపూర్ పరిధిలో స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కాగా, తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో.. హోరాహోరీగా ప్రచారం సాగింది. ఈ నెల 25 అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.