మున్నిపల్ ఎన్నికలు: మరికొద్ది గంటల్లో ఫలితాలు, క్యాంపులకు అభ్యర్థులు
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. ఇప్పటికే ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికలు నిర్వహించిన 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర మున్సిపాలిటీ శాఖ డైరెక్టర్ శ్రీదేవితో కలిసి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
సాయంత్రానికల్లా..
శనివారం సాయంత్రానికల్లా అన్ని ఫలితాలు వెలువడతాయని, జనవరి 27న మేయర్లు, ఛైర్ పర్సన్ల ఎన్నికకు పరోక్ష ఎన్నిక నిర్వహిస్తామని తెలిపారు. జనవరి 29న కరీంనగర్ మేయర్ ఎన్నిక ఉంటుందని చెప్పారు. పరోక్ష ఎన్నికల్లో ఓట్లు సమానంగా వస్తే లాటరీ ద్వారా విజేతను ఎంపిక చేస్తామని నాగిరెడ్డి తెలిపారు. రాజకీయ పార్టీలు మేయర్, ఛైర్ పర్సన్ల పేర్లను ఏ, బీ ఫారాల ద్వారా ఇవ్వాలని నాగిరెడ్డి సూచించారు. జనవరి 26న ఉదయం 11 గంటలలోపు ఏ ఫారం, 27న ఉదయం 10 గంటలలోపు బీ ఫారం ఇవ్వాలని స్పష్టం చేశారు.
పరోక్ష ఎన్నిక నేపథ్యంలో..
మేయర్, ఛైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా రాజకీయ పార్టీలు తమ విప్లను నియమించుకోవచ్చని, విప్ ఎవరన్నది 26న ఉదయం 11గంటలలోపు తెలియజేయాలని సూచించారు. పరోక్ష ఎన్నిక నేపథ్యంలో ప్రత్యేక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని, శనివారం సాయంత్రం నుంచి అమల్లోకి వస్తుందని నాగిరెడ్డి తెలిపారు. సాధారణ నియమావళిలాగే ఇది కూడా ఉంటుందని చెప్పారు. మున్సిపాలిటీల్లో 74.40శాతం, కార్పొరేషన్లలో 58.83శాతం పోలింగ్ నమోదైందని నాగిరెడ్డి వివరించారు.
ఎక్స్ అఫీషియో సభ్యులూ ఓటు వేయొచ్చు..
మున్సిపల్ డైరెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ.. మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో ఎక్స్అఫీషియో సభ్యులకు కూడా ఓటు హక్కు ఉంటుందని తెలిపారు. శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఒకే మున్సిపాలిటీ ఉంటే స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో హోదాలో అక్కడే ఓటు వేయాలన్నారు. అయితే, ఒకటి కంటే ఎక్కువ మున్సిపాలిటీలు ఉంటే వారు ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.
క్యాంపులకు అభ్యర్థులు
జనవరి 22న తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలు జరగగా, కరీంనగర్లో మాత్రం జనవరి 24న ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలోనే కరీంనగర్ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. కాగా, శనివారం ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో తమ అభ్యర్థులను ఆయా పార్టీలు ఇప్పటికే క్యాంపులకు తరలించడం గమనార్హం. ఫలితాల కోసం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.