మున్సిపల్ ఎన్నికల ఫలితాలు : మంత్రి కేటీఆర్ ఇలాఖాలో టీఆర్ఎస్కు రెబల్స్ షాక్..
తెలంగాణలో మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు గతేడాది జరిగిన జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలనే తలపిస్తున్నాయి. దాదాపుగా 104 మున్సిపాలిటీల్లో కారు జోరులో ఉండగా.. ప్రతిపక్షాలు కాంగ్రెస్,బీజేపీ టీఆర్ఎస్ దరిదాపుల్లో కూడా లేవు. మున్సిపల్ ఎన్నికల్లోనూ తిరుగులేని విజయం దిశగా సాగుతున్నప్పటికీ.. టీఆర్ఎస్కు కూడా అక్కడక్కడా షాక్లు తప్పడం లేదు.
కేటీఆర్ ఇలాఖాలో.. :
మంత్రి కేటీఆర్ ఇలాఖాలో ఇండిపెండెంట్ అభ్యర్థులు అనూహ్య షాక్ ఇచ్చారు. టీఆర్ఎస్ రెబల్స్గా బరిలో దిగినవారిలో 10మంది ఇండిపెండెంట్స్ విజయం సాధించారు. ఎన్నికల ముందు మంత్రి వీరికి ఎంతగా నచ్చజెప్పినప్పటికీ పోటీ నుంచి తప్పుకోలేదు. తాజా ఫలితాల్లో మొత్తం 39 వార్డులకు గాను టీఆర్ఎస్ 24,బీజేపీ 3,కాంగ్రెస్ 2,ఇండిపెండెంట్స్ 10 స్థానాల్లో విజయం సాధించారు. రెబల్స్ ఎన్నికల్లో గెలుపొందినా తిరిగి పార్టీలోకి తీసుకునేది లేదని ఎన్నికలకు ముందు కేటీఆర్ తేల్చి చెప్పారు. దీంతో గెలుపొందిన ఇండిపెండెంట్లను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తారా.. లేక ఎన్నికల నాటి మాటకే కట్టుబడి ఉంటారా అన్నది వేచి చూడాలి.
కొడంగల్లో మరోసారి టీఆర్ఎస్ హవా..
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఇలాఖా అయిన కొడంగల్లో ఈసారి కూడా టీఆర్ఎస్ పాగా వేసింది. డిసెంబర్ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ స్థానాన్ని కైవసం చేసుకున్న టీఆర్ఎస్.. తాజాగా మున్సిపల్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. దాదాపుగా అన్ని వార్డుల్లోనూ టీఆర్ఎస్ విజయం సాధించగా.. కేవలం మూడు వార్డుల్లోనే కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
మహబూబ్నగర్లో కాంగ్రెస్ నుంచి పోటీ..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు,కార్పోరేషన్లలో తిరుగులేకుండా దూసుకుపోతున్న టీఆర్ఎస్కు.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మాత్రం పోటీ ఎదురవుతోంది. నాగర్కర్నూలు,వనపర్తి,కల్వకుర్తి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది. ఇక కొల్లాపూర్లో టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తప్పలేదు. అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
120 మున్సిపాలిటీలు, 9 కార్పోరేషన్లకు ఎన్నికలు..
ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికల జరిగిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మొత్తం 2619 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఓట్ల సంఖ్యను బట్టి 5 నుంచి 24 రౌండ్లలో కౌంటింగ్ చేపడుతున్నారు. ఎప్పటిలాగే మొదట పోస్టల్ బ్యాలెట్,అనంతరం బ్యాలెట్ పత్రాల ఓట్లను లెక్కిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.