మున్సిపల్ ఎన్నికల్లో పోటెత్తిన ఓటర్లు.. 80 శాతం పైనే.. 24న కరీంనగర్లో..
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికలు జరిగిన 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో బుధవారం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. చాలా చోట్ల సాయంత్రం 5 తర్వాత కూడా క్యూలైన్లు కిక్కిరిసాయి. గడువులోగా లోపలికొచ్చిన అందరికీ ఓటేసే అవకాశం కల్పించామని ఎన్నికల అధికారులు చెప్పారు. 9 కార్పొరేషన్లలో 324 డివిజన్లు, 120 మున్సిపాలిటీల్లోని 2647 వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఈనెల 25న వెలువడనున్నాయి.
భారీ స్పందన..
సాధారణ ఎన్నికల్లో గ్రామాలతో పోల్చుకుంటే పట్టణాలు, సిటీల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదయ్యే సంగతి తెలిసిందే. కానీ బుధవారం నాటి మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్సైంది. బ్యాలెట్ దద్దరిల్లే రేంజ్ లో ఓటింగ్ శాతం నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ పర్సంటేజ్ దాదాపు 80 శాతంగా నమోదైందని, అన్ని ప్రాంతాల నుంచి పూర్తి స్థాయి లెక్కలు వచ్చిన తర్వాత ఈ శాతం ఇంకొంత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
ఎక్కువ.. తక్కువ.. రెండూ గ్రేటర్ శివారులోనే
గ్రేటర్ హైదరాబాద్ ను ఆనుకుని ఉన్న మున్సిపాలిటీల్లో అత్యధిక శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. తిరుమలగిరి, ఆదిభట్ల, మోత్కూర్, చౌటుప్పల్ తదిర మున్సిపాలిటీల్లో పోలింగ్ శాతం రికార్డు స్థాయిలో ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అదేసమయంలో ఇదే గ్రేటర్ శివారులోని నిజాంపేట్, మణికొండలో చాలా తక్కువ శాతం పోలింగ్ రికార్డయినట్లు చెప్పారు.
కరీంనగర్ లో ముగిసిన ప్రచారం..
అనివార్య కారణాల వల్ల కరీంనగర్ కార్పొరేషన్ లో ఎన్నికలు మగతా వాటికంటే రెండ్రోజులు ఆలస్యంగా జరుగుతున్నాయి. బుధవారం సాయంత్రంతో అక్కడ ప్రచార పర్వం ముగిసింది. ఈ నెల 24న పోలింగ్ జరుగనుంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పోలీస్ సెక్యూరిటీని వెనక్కి పంపడం వివాదాస్పదమైంది. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎంపీపై రాళ్ల దాడి జరిగిందనే అనుమానంతో.. ఆయన ఫిర్యాదు చేయనప్పటికీ పోలీసులు సెక్యూరిటీ ఏర్పాటుచేశారు. దానిపై ఎంక్వైరీ చేసిన కమిషనర్.. రాళ్ల దాడి జరగలేదని చెప్పడంతో ఎంపీ ఈ మేరకు తన నిరసనను తెలియజేశారు.