పార్టీ కండువాతో ఉరిరేసుకుని.. గంగాభవాని ఆత్మహత్యాయత్నం.. మాజీ మంత్రిపై మనీషా సంచలన ఆరోపణలు
''నా పిల్లల కంటే కూడా పార్టీనే ఎక్కువ ప్రేమించాను... పదిహేనేళ్లుగా పార్టీ కోసం నేను చేయని త్యాగమంటూ లేదు... హైకమాండ్, లోకల్ నాయకుల ఆదేశాల మేరకు నడుచుకున్నాను... ఇంతచేసినా కనీసం వార్డు మెంబర్ గానైనా నాకు అవకాశం ఇవ్వరా?.. నిన్నగాక మొన్న పక్క పార్టీ నుంచి జంప్ అయినవాళ్లకు టికెట్లిస్తారా?.. ఈ అన్యాయాన్ని నేను భరించలేను.. ఇంతకంటే చనిపోవడం మంచిది...''అని వెక్కివెక్కి ఏడుస్తూ సొంత పార్టీ జెండాతోనే ఉరివేసుకుంది గంగా భవాని.
ఊరికో గంగా భవాని..
జనగామ జిల్లాకు చెందిన గంగా భవాని.. టీఆర్ఎస్ పార్టీలో పెద్దగా గుర్తింపులేని ఓ సాధారణ కార్యకర్తే కావచ్చు. కానీ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోన్న ఆగ్రహావేశాలకు ప్రతీక. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలనే చోటుచేసుకున్నాయి. పార్టీ తమకు అన్యాయం చేసిందని ఆరోపిస్తూ పలువురు ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనంగా మారింది. జనగాం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే ఆఫీసులో పార్టీ జెండాతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన గంగా భవానికి సహచరులు కాపాడారు.
వెనక్కి తగ్గని రెబల్స్..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మరో కీలక ఘట్టం పూర్తైంది. మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 3052 వార్డులకుగానూ భారీ స్థాయిలో 25,768 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. చివరి నిమిషం దాకా బేరసారాలు కొనసాగాయి. అన్ని పార్టీల్లో ముఖ్యనేతలు రంగంలోకి దిగినప్పటికీ రెబల్స్ వెనక్కి తగ్గలేదు. మెజార్టీ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు పోటీగా రెబల్స్ బరిలోనే నిలబడ్డారు.
మనీషా కంతటడి..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ఉద్రిక్తతలకు దారితీసింది. మున్సిపల్ మాజీ చైర్మన్ మనీషా టీఆర్ఎస్ రెబల్ గా నామినేషన్ వేశారు. కానీ హైకమాండ్ దూతలు నచ్చచెప్పడంతో ఆమె ఏడ్చుకుంటూ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. సొంత కొడుకును చైర్మన్ చేసుకునేందుకు మాజీ మంత్రి జోగురామన్న కుట్రలు చేస్తున్నారని మనీషా ఆరోపించడంతో రామన్న అనుచరులు వాగ్వాదానికి దిగారు. మేడ్చల్ జిల్లాలోనూ విజయ్ అనే వ్యక్తి బీఫామ్ దక్కలేదన్న బాధతో ఆత్మహత్యకుయత్నించాడు. కరీంనగర్ మినహా రాష్ట్రంలోని 9 కార్పొరేషన్లలోని 325 కార్పొరేటర్, 120 మున్సిపాలిటీల్లోని 2,727 కౌన్సిలర్ స్థానాలకు జనవరి 22న ఎన్నికలు జరగనున్నాయి. 25న ఫలితాలు వెలువడతాయి.