గంగుల కమలాకర్ రాజకీయ ప్రస్థానం.. మంత్రి పదవి అందుకేనా.. కేసీఆర్ వ్యూహం ఇదేనా?
కరీంనగర్ : రాజకీయ సమీకరణాలు, జిల్లాల ప్రాధాన్యత తదితర అంశాలు వెరసి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు మంత్రి పదవి దక్కింది. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కమలాకర్కు మంత్రి పదవి దక్కడంపై హర్షం వ్యక్తమవుతోంది. సీఎం కేసీఆర్ కేబినెట్లో ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ మంత్రులుగా పనిచేస్తున్నారు.. ఇప్పుడు గంగుల కమలాకర్కు కూడా మంత్రి పదవి కట్టబెట్టడంతో జిల్లాకు సముచిత ప్రాధాన్యం దక్కినట్లైంది. అయితే కరీంనగర్ కోటాలో ఈసారి మంత్రి పదవి డిక్లేర్ చేయడం బీజేపీకి చెక్ పెట్టడానికే అంటున్నారు కొందరు.
కరీంనగర్ ఇలాకాలో కారు జోరుకు కమలం బ్రేకులు
ఉద్యమాల పురిటి గడ్డగా కరీంనగర్ జిల్లాకు పేరుంది. ఉద్యమ నేపథ్యం మొదలు రాజకీయ శక్తిగా అవతరించిన గులాబీ పార్టీకి ప్రతి సందర్భంలో వెన్నుదన్నుగా నిలిచింది కరీంనగర్ గడ్డ. తొలినాళ్ల నుంచి టీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తూనే ఉన్నారు ఇక్కడి ప్రజలు. అయితే మొన్నటి లోక్సభ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. టీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ను కాదని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కు ఎంపీగా పట్టం కట్టారు జిల్లా ప్రజలు. ఇక అప్పటి నుంచి జిల్లాలో టీఆర్ఎస్ ప్రస్థానంపై గులాబీ వనంలో అంతర్మథనం మొదలైందనే ప్రచారం జోరందుకుంది. కరీంనగర్ ఇలాకాలో కారు ఢీలా పడటం ఆ పార్టీ పెద్దలు జీర్ణించుకోలేక పోతున్నారనే వాదనలు కొకొల్లలు.
కేసీఆర్ వ్యాఖ్యలే కొంప ముంచాయా?
లోక్సభ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ప్రచార నిమిత్తం కరీంనగర్ సభలో పాల్గొన్నారు. అయితే హిందుగాళ్లు బొందుగాళ్లు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అదే పాయింట్ బీజేపీకి కలిసొచ్చినట్లైంది. ఆ విషయాన్ని బీజేపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా బాగా వైరల్ చేశారు. ఎంతలా అంటే మారుమూల పల్లెలకు సైతం చేరేలా వాట్సాప్ తదితర వేదికలను వాడుకుని విస్తృతంగా కేసీఆర్ మీద, టీఆర్ఎస్ మీద నెగెటివ్ ప్రచారం చేశారు. అది కాస్తా ఓట్ల రూపంలో టీఆర్ఎస్కు దెబ్బ కొట్టిందనే వాదనలు లేకపోలేదు. అయితే కరీంనగర్ ఎంపీ స్థానం గులాబీ వనం నుంచి చేజారడంతో కేసీఆర్ అలర్టైనట్లు తెలుస్తోంది. అందుకే కమలాకర్కు మంత్రి పదవి ఇచ్చి ఆ మచ్చను తుడిపేసుకునే ప్రయత్నం చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. కరీంనగర్కు కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని నమ్మించే క్రమంలో ఆయనకు బెర్త్ కన్ఫామ్ చేశారనే టాక్ నడుస్తోంది.
గంగుల కమలాకర్ ప్రస్థానం.. అంచెలంచెలుగా ఎదుగుతూ..!
గంగుల కమలాకర్ కుటుంబానిది వ్యాపార నేపథ్యం. బిజినెస్ ఫ్యామిలీ నుంచి క్రమక్రమంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కమలాకర్. ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం నేతగా ఆ పార్టీకి అవిశ్రాంతంగా పనిచేశారు. కరీంనగర్లో టీడీపీ బలోపేతానికి గంగుల హ్యాండ్ ఉందనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. అలా చంద్రబాబు నాయుడికి సన్నిహితుడిగా మారిన కమలాకర్ 2009లో కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే అదే సమయంలో తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజీకి చేరడంతో తర్జన భర్జన పడ్డారు. చివరకు 2014 ఎన్నికల నాటికి గులాబీ తీర్థం పుచ్చుకుని కారేక్కేశారు.
టీడీపీ నుంచి ఒకసారి.. టీఆర్ఎస్ నుంచి రెండు సార్లు.. హ్యాట్రిక్ ఎమ్మెల్యే
అలా టీఆర్ఎస్ నుంచి 2014లో ఎమ్మెల్యేగా మరోసారి గెలిచారు. అనంతరం మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకోసారి పోటీ చేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. కరీంనగర్ నుంచి ఇప్పటివరకు మూడుసార్లు ఎమ్మెల్మేగా గెలిచింది గంగుల ఒక్కరే కావడం విశేషం. మొత్తానికి మంత్రివర్గ విస్తరణలో ఆయనకు బెర్త్ దక్కడంపై ఆయన అనుచరవర్గంలో హర్షం వ్యక్తమవుతోంది.
మంత్రి పదవికి తన పేరు ఖరారు చేయగానే కమలాకర్ స్పందించారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. తనకు ఏ శాఖ ఇచ్చినా ఆనందంగా పనిచేస్తానని.. తన శాయశక్తులా ఆ శాఖకు న్యాయం చేస్తానని పేర్కొన్నారు. ప్రజల కోసం, ప్రజల అభివృద్ది కోసం మంత్రిగా తన వంతు సేవలు అందిస్తానని తెలిపారు.