కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం.. మంత్రి పువ్వాడ అజయ్ రాజకీయ ప్రస్థానం
ఖమ్మం : కమ్యూనిస్టుల కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ ఆ ప్రొఫైల్ తనకు సరిపోలేదు. అందుకే ముచ్చటగా మూడు పార్టీలు మారారు. తండ్రి కరడుగట్టిన కమ్యూనిస్టు నేతగా రాణించి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అదంతా తనకు ఎందుకనుకున్నారో ఏమో గానీ అటు వైపు మాత్రం చూడలేదు. అలా వైసీపీ నుంచి రాజకీయ ప్రస్థానం కొనసాగించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా చేరారు. ఆ తర్వాత అధికార పార్టీ టీఆర్ఎస్లో చేరి ఏకంగా మంత్రి పదవి కొట్టేశారు. తెలంగాణ కేబినెట్లో మంత్రిగా కొలువుదీరిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ రాజకీయ ప్రస్థానంపై వన్ఇండియా స్పెషల్ స్టోరీ.
తండ్రి కరడుగట్టిన కమ్యూనిస్టు నేత.. అజయ్ మాత్రం అటు చూడలేదు..!
1965, ఏప్రిల్ 4వ తేదీన ఖమ్మం జిల్లా పోలవరం మండలం కునవరం గ్రామంలో జన్మించారు పువ్వాడ అజయ్ కుమార్. ఆయన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు కరడుగట్టిన కమ్యూనిస్ట్ నేత. 1994లో సీపీఐ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే పువ్వాడ అజయ్ కుమార్ మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ వైపు చూడలేదు. వైసీపీలో చేరి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అలా 2014లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తదనంతర పరిణామాలతో టీఆర్ఎస్ గూటికి చేరి 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీచేసి మరోసారి విజయం సాధించారు.
ఆరుగురికి మంత్రులుగా ఛాన్స్.. కొడుకు, అల్లుడు ఈసారి.. ఇద్దరు మహిళలకు ఛాన్స్
మొదట వైసీపీ.. ఆ తర్వాత కాంగ్రెస్.. ఇప్పుడేమో టీఆర్ఎస్.. మంత్రి పదవి అలా..!
ఖమ్మం మొదటి నుంచి కూడా కమ్యూనిస్టుల కోటని చెప్పొచ్చు. తొలుత వైసీపీలో చేరిన అజయ్.. అనంతరం హస్తం గూటికి చేరారు. అదే క్రమంలో మరోసారి పార్టీ మారి ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రాజకీయ సమీకరణాలు, జిల్లాలకు తగిన ప్రాధానత్య తదితర కారణాలతో ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు సీఎం కేసీఆర్. గులాబీ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా కాంగ్రెస్ నుంచి కారెక్కేటప్పుడు భవిష్యత్తులో మంచి అవకాశం ఇస్తానన్న మాటకు కట్టుబడి కేసీఆర్ ఆయనకు ఈసారి మంత్రి పదవి కట్టబెట్టారనే టాక్ నడుస్తోంది. కమ్యూనిస్టుల కంచుకోటలో గులాబీ జెండా మరింత రెపరెపలాడేలా మినిస్టర్ పోస్టు ఇచ్చారనే వాదనలు లేకపోలేదు.
మామ ప్రభుత్వంలో అల్లుడు.. రెండోసారి మంత్రిగా హరీశ్ రావు ప్రస్థానం
తుమ్మలను ఓడించడంతో గుర్తింపు..!
2014 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం సెగ్మెంట్ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఓడించడంతో పువ్వాడ అజయ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అజయ్.. తుమ్మలను కేవలం 5 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడించడం అప్పట్లో చర్చానీయాంశమైంది. 2014 ముందు వరకు వైసీపీలో ఉన్న అజయ్.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు. అలా ఆ పార్టీ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.