తెలంగాణలో అదే రేంజ్లో: 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు: టెస్టులూ తగ్గాయ్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల పరంపర కొనసాగుతోంది. ఇదివరకు నమోదైన కేసులతో పోల్చుకుంటే కొద్దిగా డౌన్ఫాల్ కనిపించింది. పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. మరోసారి వెయ్యికి పైగా కరోనా కేసులు రికార్డు అయ్యాయి. 24 గంటల వ్యవధిలో కొత్తగా 1256 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 80 వేల మార్క్ను దాటేశాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సహా.. పలు జిల్లాల్లో భారీగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.
Recommended Video
24 గంటల్లో 1256 కొత్త కేసులు
తెలంగాణలో 24 గంటల్లో కొత్తగా 1256 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 10 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 80,751కి చేరుకుంది. ఇందులో 57,586 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 637కు పెరిగింది. యాక్టివ్ కేసులు 22,528గా నమోదు అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ కార్యాలయం కొద్దిసేపటి కిందటే బులెటిన్ను విడుదల చేసింది. డిశ్చార్జి అయిన వారి సంఖ్య క్రమంగా మెరుగుపడుతోంది. అరలక్షను దాటింది. 24 గంటల వ్యవధిలో 1587 మంది డిశ్చార్జి కావడం దీనికి నిదర్శనం.
జీహెచ్ఎంసీలో అదే దూకుడు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వైరస్ ఉధృతి ఏ మాత్రం తగ్గట్లేదు. ఇదివరకు నమోదైన కేసులతో పోల్చుకుంటే తాజాగా వెలుగులోకి వచ్చిన పాజిటివ్స్ తక్కువే. 24 గంటల వ్యవధిలో జీహెచ్ఎంసీ పరిధిలో 389 పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. జీహెచ్ఎంసీ తప్పించితే.. మిగిలిన ఏ జిల్లాలో కూడా కొత్తగా నమోదైన కేసులు వందను దాటలేదు. జీహెచ్ఎంసీ తరువాత ఆ స్థాయిలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 86 కేసులు నమోదు అయ్యాయి.
జిల్లాలవారీగా కరోనా కేసులివే..
జిల్లాలవారీగా చూస్తే 24 గంటల్లో ఆదిలాబాద్-63, భద్రాద్రి కొత్తగూడెం-7, జగిత్యాల-13, జనగామ-20, జయశంకర్ భూపాలపల్లి-6, జోగుళాంబ గద్వాల-14, కామారెడ్డి-8, కరీంనగర్-73, ఖమ్మం-28, మహబూబ్ నగర్-21, మహబూబాబాద్-19, మంచిర్యాల-11, మెదక్-9, మేడ్చల్ మల్కాజ్గిరి-34, ములుగు-3, నాగర్ కర్నూలు-38, నల్లగొండ-58, నారాయణపేట్-12, నిర్మల్-19, నిజామాబాద్-33,పెద్దపల్లి-23, రాజన్న సిరిసిల్ల- 31, రంగారెడ్డి-86, సంగారెడ్డి-74, సిద్ధిపేట్-45, సూర్యాపేట్-20, వికారాబాాద్-6, వనపర్తి-12, వరంగల్ రూరల్-11, వరంగల్ అర్బన్-67, యాదగిరి భువనగిరి-3 కేసులు నమోదు అయ్యాయి. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కొత్తగా ఒక్క కేసూ నమోదు కాలేదు.
తగ్గిన కరోనా శాంపిల్స్ టెస్టులు..
తెలంగాణలో కరోనా వైరస్ పరీక్షలు బాగా తగ్గాయి. 24 గంటల వ్యవధిలో మొత్తం 11,609 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ బులెటిన్లో పేర్కొన్నారు. దీనితో ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 6,24,840కి చేరుకుంది. రోజూ కనీసం 40 వేల వరకు కరోనా టెస్టులను నిర్వహించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించినప్పటికీ ఆ స్థాయికి చేరుకోవడానికి అధికారులు ప్రయత్నించట్లేదనేది దీనితో స్పష్టమైనట్టు కనిపిస్తోంది. ఆర్టీ-పీసీఆర్, సీబీనాట్ ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబొరేటరీల్లో ముమ్మరంగా శాంపిళ్ల టెస్టులను కొనసాగిస్తున్నామని చెప్పారు.