తెలంగాణ..తగ్గుముఖం పట్టని కరోనా: కొత్తగా మరిన్ని కేసులు: రెండు వేలకు టచ్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ సంక్షోభం కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల తీవ్రత ఎప్పట్లాగే కొనసాగుతోంది. కరోనా వైరస్ను నియంత్రించడానికి కేసీఆర్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలను కొనసాగిస్తున్నప్పటికీ.. అడ్డుకట్ట పడట్లేదు. మరణాల సంఖ్యా పెరుగుతోంది. ప్రతిరోజూ రెండువేల వరకు పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో 1921 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తొమ్మిది మరణించారు. 1210 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ కార్యాలయం బులెటిన్ను విడుదల చేసింది.
దీనితో ఇప్పటిదాకా తెలంగాణలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 88,396కు చేరుకుంది. ఇందులో 64,284 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 674కు పెరిగింది. మొత్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 23,438గా నమోదు అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వైరస్ ఉధృతి ఏ మాత్రం తగ్గట్లేదు. ఎప్పట్లాగే పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో జీహెచ్ఎంసీ పరిధిలో 356 పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో వందకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.
జిల్లాలవారీగా 24 గంటల్లో ఆదిలాబాద్-28, భద్రాద్రి కొత్తగూడెం-34, జగిత్యాల-40, జనగామ-38, జయశంకర్ భూపాలపల్లి-21, జోగుళాంబ గద్వాల-51, కామారెడ్డి-44, కరీంనగర్-73, ఖమ్మం-71, కొమరంభీమ్ ఆసిఫాబాద్-17, మహబూబ్ నగర్-48, మహబూబాబాద్-38, మంచిర్యాల-18, మెదక్-39, మేడ్చల్ మల్కాజ్గిరి-168, ములుగు-12, నాగర్ కర్నూలు-26, నల్లగొండ-73, నారాయణపేట్-6, నిర్మల్-37, నిజామాబాద్-63,పెద్దపల్లి-54, రాజన్న సిరిసిల్ల- 33, రంగారెడ్డి-134, సంగారెడ్డి-90, సిద్ధిపేట్-63, సూర్యాపేట్-47, వికారాబాాద్-14, వనపర్తి-41, వరంగల్ రూరల్-54, వరంగల్ అర్బన్-74, యాదగిరి భువనగిరి-16 కేసులు నమోదు అయ్యాయి.
24 గంటల వ్యవధిలో మొత్తం 22,046 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ బులెటిన్లో పేర్కొన్నారు. దీనితో ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 7,11,196కు చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్, సీబీనాట్ ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి 10 లక్షలమంది జనాభాకు సగటున 19,156 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.