బేజారెత్తిస్తోన్న కరోనా: వర్షాలకు తోడుగా వైరస్: సీజనల్ వ్యాధులు: తెలంగాణపై ముప్పేటదాడి
హైదరాబాద్: ఒకవంక భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తుతున్నాయి. ఈదురుగాలులు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. మరోవంక- సీజనల్ వ్యాధులు క్రమంగా ముసురుకుంటున్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారితో సతమతమౌతోన్న తెలంగాణ.. వాతావరణంలో చోటు చేసుకున్న తాజా మార్పులతో మరింత గడ్డు పరిస్థితులను చవి చూస్తోంది. ముప్పేటదాడిని ఎదుర్కొంటోంది. కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సీజనల్ వ్యాధులు చుట్టుముట్టుకుంటుండటంతో ఆసుప్రతులకు రోగుల తాకిడి పెరుగుతోంది.
కరోనా.. సీజనల్ వ్యాధులు..
వైరస్ ఉధృతి కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా పుట్టుకొస్తోన్న సీజనల్ వ్యాధులతో జనం బెంబేలెత్తుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కేసు ఉధృతిలో ఎలాంటి మార్పూ ఉండట్లేదు. అయిదు జిల్లాల్లో వందకు పైగా పాజిటివ్ కేసులు కొత్తగా వెలుగులోకి వచ్చాయి. కరీంనగర్, రంగారెడ్డి, సిద్ధిపేట్, నల్లగొండ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో కేసుల వెల్లువలో మార్పు ఉండట్లేదు. రోజువారీ పాజిటివ్ కేసులు యాధాతథంగా రికార్డవుతూనే వస్తున్నాయి.
24 గంటల్లో కొత్తగా 2,137 కరోనా కేసులు..
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,137 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఎనిమిది మంది మరణించారు. 2,192 మంది కరోనా బారి నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,71,306కు చేరుకుంది. ఇందులో డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,39,700గా నమోదైంది. కరోనా వల్ల 1033 మంది మరణించారు. మొత్తం 30,573 మంది ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. 24,019 మంది పేషెంట్లు గృహాలు, ఇన్స్టిట్యూషనల్ ఐసొలేషన్లో చికిత్స పొందుతున్నారు.
గ్రేటర్ సహా జిల్లాల్లో తీవ్రత..
ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించింది. కొత్తగా 24 గంటల్లో 322 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరీంనగర్, రంగారెడ్డి, సిద్ధిపేట్, నల్లగొండ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో వందకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. జంటనగరాల్లో సీజనల్ వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రుల్లో క్రమంగా పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది.
జిల్లాల్లో కరోనా లెక్కలివీ..
ఆదిలాబాద్-20, భద్రాద్రి కొత్తగూడెం-51, జగిత్యాల-42, జనగామ-34, జయశంకర్ భూపాలపల్లి-21, జోగుళాంబ గద్వాల-27, కామారెడ్డి-60, కరీంనగర్-132, ఖమ్మం-90, కొమరంభీమ్ ఆసిఫాబాద్-16, మహబూబ్ నగర్-28, మహబూబాబాద్-72, మంచిర్యాల-38, మెదక్-28, మేడ్చల్ మల్కాజ్గిరి-146, ములుగు-15, నాగర్ కర్నూలు-37, నల్లగొండ-124, నారాయణపేట్-9, నిర్మల్-24, నిజామాబాద్-72, పెద్దపల్లి-48, రాజన్న సిరిసిల్ల-57, రంగారెడ్డి-182, సంగారెడ్డి-65, సిద్ధిపేట్-109, సూర్యాపేట్-61, వికారాబాాద్-29, వనపర్తి-29, వరంగల్ రూరల్-24, వరంగల్ అర్బన్-90, యాదాద్రి భువనగిరి-35 కేసులు నమోదు అయ్యాయి.
Recommended Video
టెస్టుల్లో అదే జోరు..
కరోనా వైరస్ పరీక్షల జోరు కొనసాగుతోంది. 24 గంటల్లో కొత్తగా 53,811 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 24,88,220కి చేరుకుంది. కరోనా పరీక్షల్లో కొత్త రికార్డును ప్రభుత్వం నెలకొల్పింది. ప్రతి 10 లక్షల మందికీ 67,020 టెస్టులను నిర్వహించింది. ఇప్పటిదాకా ఈ స్థాయిలో కరోనా పరీక్షలు తెలంగాణలో నమోదు కాలేదు.