ఎన్నికల నెల: గ్రేటర్లో కరోనా: తెలంగాణలో ఇక తగ్గుముఖమే: రెండున్నర లక్షలకు చేరువగా
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తెలంగాణ క్రమంగా తగ్గుముఖం పట్టినట్టే. కొద్దిరోజులుగా వరుసగా వెయ్యికి దిగువగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. రోజువారీ కరోనా నిర్ణారణ పరీక్షలు జోరుగా కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ వెయ్యికి దిగువగా కొత్త కేసులు నమోదు కావడం శుభపరిణామంగా భావిస్తున్నారు అధికారులు. కరోనా మరణాలు అయిదుకు మించట్లేదు. కొత్త కేసులకు అనుగుణంగా కరోనా పేషెంట్ల సంఖ్య కూడా భారీగా క్షీణిస్తోంది.
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 948 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయిదుమంది మరణించారు. 1,607 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,59,776కు చేరుకుంది. ఇందులో డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,45,293గా నమోదైంది. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 1415కు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్గా ఉన్న కేసులు 13,068గా నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్స్టిట్యూషనల్ ఐసొలేషన్లో 10,710 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
గ్రేటర్ హైదరాబాద్లో కొత్తగా 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్-14, భద్రాద్రి కొత్తగూడెం-61, జగిత్యాల-27, జనగామ-9, జయశంకర్ భూపాలపల్లి-14, జోగుళాంబ గద్వాల-8, కామారెడ్డి-25, కరీంనగర్-55, ఖమ్మం-44, కొమరంభీమ్ ఆసిఫాబాద్-5, మహబూబ్ నగర్-11, మహబూబాబాద్-11, మంచిర్యాల-26, మెదక్-15, మేడ్చల్ మల్కాజ్గిరి-83, ములుగు-18, నాగర్ కర్నూలు-16, నల్లగొండ-45, నారాయణపేట్-4, నిర్మల్-10, నిజామాబాద్-13, పెద్దపల్లి-22, రాజన్న సిరిసిల్ల-9, రంగారెడ్డి-76, సంగారెడ్డి-38, సిద్ధిపేట్-22, సూర్యాపేట్-24, వికారాబాాద్-14, వనపర్తి-11, వరంగల్ రూరల్-12, వరంగల్ అర్బన్-40, యాదాద్రి భువనగిరి-12 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 42,433 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు.
Recommended Video
ఈ పరిణామాల మధ్య గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహించబోతోంది తెలంగాణ ఎన్నికల కమిషన్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఇదివరకు రోజూ వెయ్యి వరకు కొత్త కేసులు నమోదు అయ్యాయి. కొంత కాలంగా ఆ సంఖ్య 200లకు మించట్లేదు. గ్రేటర్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల సందర్భంగా మళ్లీ కరోనా వైరస్ విజృంభించే అవకాశాలు ఉండటంతో ఎన్నికల అధికారులు కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటున్నారు.