జీతాలు ఇవ్వలేని స్థితిలో ధనిక రాష్ట్రం, సీఎం కేసీఆర్పై బండి సంజయ్ ఫైర్
సీఎం కేసీఆర్పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం పేరుకే ధనిక రాష్ట్రం అని, ఉద్యోగులకు పూర్తిస్థాయిలో జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అని విమర్శించారు. దేశంలో అన్ని రాష్ట్రాలు ఉద్యోగులు జీతాలు అందజేస్తున్నాయని.. కానీ రాష్ట్రంలో కోత పెట్టడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు.
వేతన సవరణ ఇఫ్పటికీ చేయలేదని.. 2018 నుంచి పొడగిస్తూ వస్తూనే ఉన్నారని మండిపడ్డారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి అందజేసిందని గుర్తుచేశారు. కానీ తెలంగాణ ఉద్యోగులకు ఐఆర్ లేదు.. పూర్తి జీతం కూడా ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని టీఆర్ఎస్ సర్కార్ దిగజార్చిందని ఆరోపించారు. కొత్త ఉద్యోగ నియమాకాలు కూడా ఆశించిన స్థాయిలో లేవు అని.. లక్ష ఉద్యోగాలు అని చెప్పిన సీఎం కేసీఆర్ 40 వేల కొలువులను కూడా నియమించలేదని పేర్కొన్నారు.
రిటైర్డ్ ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది కానీ.. కొలువులను మాత్రం చేయడం లేదన్నారు. 2018 ముందస్తు ఎన్నికల సమయంలో రిటైర్మెంట్ వయస్సును 61 ఏళ్లకు పెంచుతామని చెప్పిన విషయాన్ని బండి సంజయ్ గుర్తుచేశారు. ఇప్పుడు ఆ విషయాన్నే మరచిపోయారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగి అనే పదమే ఉండకుండా చేస్తామని చెప్పి.. ఇప్పుడు వారితోనే పనిచేయించుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం సాయం చేస్తే తప్ప.. నడవలేని స్థిలో ఉంది అని, నైతికంగా రాష్ట్రాన్ని పాలించే హక్కును కేసీఆర్ కోల్పోయారని బండి సంజయ్ అన్నారు.