ఎవరి వల్ల 'తెలంగాణ' రాష్ట్రం వచ్చింది, ఢిల్లీలో చక్రం తిప్పిందెవరు!?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యలు, కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి, జానా రెడ్డి, బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డిల కౌంటర్ నేపథ్యంలో... కాంగ్రెస్, బిజెపి, టిడిపి, టిఆర్ఎస్ల మధ్య తెలంగాణ సాధనకు కారణం ఎవరు? ఆసక్తికర చర్చ, సవాళ్లు, ప్రతిసవాళ్లు కనిపిస్తున్నాయి.
మూడు రోజుల క్రితం కెసిఆర్ వరంగల్ జిల్లాలోని హన్మకొండ వరంగల్ ఉప ఎన్నిక బహిరంగ సభలో కాంగ్రెస్ నేతలు జానా, జైపాల్, బిజెపి నేత కిషన్ రెడ్డిల పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారు తన పైన విమర్శలు చేయడాన్ని కెసిఆర్ ఆక్షేపించారు.
అరవయ్యేళ్ల పాటు సమైక్య ఏపీలో టిడిపి, కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయని, అలాంటి వారు ఏం చేయలేదని, ఇప్పుడు తన పైన విరుచుకు పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ సమయంలో ఆ ముగ్గురి నేతల పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘాటైన పదజాలం ఉపయోగించారు. దీనికి వారు కూడా కౌంటర్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ సాధనకు తామే కారణమని వారు చెప్పుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో తాను ఎక్కడున్నానో ప్రజలకు తెలుసునని కెసిఆర్ చెప్పారు. అదే సమయంలో తెలంగాణ విషయంలో కిషన్ రెడ్డి, జానా రెడ్డిల తీరును ఆయన తప్పుబట్టారు.
కెసిఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని, ఆయన ఉద్యమించకుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి ఉండేది కాదని టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే, కెసిఆర్ కుటుంబ సభ్యులతో కలిసి సోనియాను ఎందుకు కలిశారని నిలదీస్తున్నారు.
ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలం ముందున్నామని చెబుతున్నారు. తాము తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఒప్పించామని చెబుతున్నారు. అదే సమయంలో రాజకీయంగా ఢిల్లీలో చక్రం తిప్పింది తామేనని అంటున్నారు.
తాను అందరితో పాటు రాజీనామా చేస్తే తెలంగాణ వచ్చి ఉండేది కాదని, కేంద్రమంత్రిగా తాను ఉండటం వల్లనే తెలంగాణ సాధ్యమైందని, కెసిఆర్ హైదరాబాదులో అలిగి కూర్చుంటే తెలంగాణ రాలేదని మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
మరోవైపు, బిజెపి నేతలు... తాము మొదటి నుంచి తెలంగాణకు కట్టుబడి ఉన్నామని, ఉద్యమంలో పాల్గొన్నామి, పార్లమెంటులో తమ పార్టీ మద్దుతు ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. అసలు సకల జనుల సమ్మె, తెలంగాణ బిల్లు పాస్ అయ్యే సమయంలో కెసిఆర్ ఎక్కడున్నారని కాంగ్రెస్, బిజెపి, టిడిపిలు నిలదీస్తున్నాయి. అయితే, ఉద్యమం ఆ స్థాయికి రావడానికి టిఆర్ఎస్ కారణమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.