కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏలుబడిలో తెలంగాణ సమాజం సంతోషంగా లేదు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్లు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మార్చాల్సిందేనని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. లేదంటే తాను బీజేపీ లేదంటే మరో ప్రత్యామ్నాయ వేదిక ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతామని స్పష్టంచేశారు. గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ బడ్జెట్ ప్రసంగం తర్వాత సీఎల్పీ సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల్లో మున్సిపల్, ఇరిగేషన్ చర్చ బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డికి అప్పగించింది.
పీసీసీ చీఫ్ మార్చాల్సిందే..
రాష్ట్రంలో పీసీసీ చీఫ్ను మార్చాల్సిందేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబట్టారు. లేదంటే పార్టీ ప్రభావం మరింత కోల్పోతుందని చెప్పారు. తాను పార్టీ మారుతానని సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతానని స్పష్టంచేశారు. బీజేపీ, లేదంటే ఇతర ప్రత్యామ్నాయ వేదిక ద్వారా ఫైట్ చేస్తానని సంకేతాలు ఇచ్చారు. దీనికి సంబంధించి సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటపెడతానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొత్త పీసీసీ చీఫ్ ఎవరికీ అప్పగిస్తారనే ఊహాగానాల నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ హీట్ పుట్టించాయి.
హామీలు ఏమయ్యాయి...?
అధికార టీఆర్ఎస్ పార్టీపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విరుచుకుపడ్డారు. 2014 ఎన్నికలకు ముందు ఇంటింటికీ మంచినీరు ఇస్తామని.. లేదంటే ఓట్లు అడగమని ప్రగల్బాలు పలికారు.. ఎన్ని ఆవాసాలకు మంచినీరు ఇచ్చారు అని ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గంలో ఎన్ని ఇళ్లకు మంచినీరు ఇచ్చారనే వివరాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. తన నియోజకవర్గంలోనే కాదు.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి కూడా అధికారులను అడుగుతున్నారని చెప్పారు. ఎక్కడ మంచినీరు ఇస్తున్నారో చెప్పాలని కోరారని... తామంటే విపక్షాలు అని... మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎందుకు పదే పదే గవర్నర్తో అబద్దాలు చెప్పిస్తున్నారని కోమటిరెడ్డి విరుచుకుపడ్డారు.
ఎన్నికల సమయంలోనే..
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏలుబడిలో తెలంగాణ సమాజం సంతోషంగా లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించాక.. పరిస్థితి ఏమాత్రం బాగుపడలేదన్నారు. ఎన్నికల సమయంలోనే రైతు బంధు పథకం ద్వారా నగదు పడుతోందని.. మిగతా సమయంలో అందరికీ నగదు పడటం లేదని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ప్రాణాలు ఆర్పించిన వారు, జైలుకెళ్లిన వారి కుటుంబాల్లో వెలుగు లేదని.. కల్వకుంట్ల కుటుంబంలో మాత్రం వెలుగు జిలుగులు అని దుయ్యబట్టారు.
ఎన్ని ఇల్లు నిర్మించారు..?
డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఎన్ని నిర్మాణాలు పూర్తి చేసిందని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంకా ఎందుకు నెరవేరడం లేదన్నారు. 2.74 లక్షల ఇండ్లు నిర్మించాల్సి ఉండగా.. ఎన్ని నిర్మించారని ప్రశ్నించారు. పేదవారికి ఎప్పుడూ ఇళ్లు నిర్మిస్తారని నిలదీశారు. రాష్ట్రంలో 12 వేల గ్రామ పంచాయతీలు ఉండగా.. ఇప్పటివరకు ఎంతమందికి ఇల్లు కట్టించి ఇచ్చారని అడిగారు. ఒక చింతమడక, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్, ఎర్రవెల్లిలో నిర్మిస్తే సరిపోతుందా అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.