కొత్త జిల్లాల ఎఫెక్ట్ : పొలాలను కమర్షియల్గా మార్చుకోవడానికి ఎగబడుతోన్న జనం
హైదరాబాద్ : తెలంగాణలొ కొత్త జిల్లాల ప్రకటనతో.. జిల్లా కేంద్రాల్లో ఉన్న భూములకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. దీంతో జిల్లా కేంద్రం పరిధిలో భూములున్నవారు.. తమ వ్యవసాయ భూములను కమర్షియల్ భూములుగా మార్చుకోవడానికి తహతహలాడుతున్నారు. దీంతో అధికారులకు దరఖాస్తులు పోటెత్తుతున్నాయి.
ఇప్పటిదాకా 600 ఎకరాల వ్యవసాయ భూమిని కమర్షియల్ అవసరాల కోసం ప్రభుత్వం ఓకె చేయగా.. మరో 800 ఎకరాల భూ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. కాగా, ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా అవినీతికి తావివ్వకుండా ఉండడానికి సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
కాగా, హెచ్ఎండీఏ పరిధిలో పెద్ద ఎత్తున అక్రమ క్రమబద్దీకరణలు వెలుగులోకి రావడంతో గత సంవత్పర కాలంగా చాలా దరఖాస్తులకు క్రమబద్దీకరణ అనుమతులు ఇవ్వలేదు ప్రభుత్వం. దీంతో చాలావరకు దరఖాస్తులు పెండింగ్ లో ఉండడంతో వాటన్నింటిపై సమగ్ర విచారణ చేయాల్సిందిగా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
హెచ్ఎండీఏ తో పాటు రాష్ట్రంలోని వివిధ మునిసిపల్ కార్పోరేషన్, మునిసిపాలిటీల్లోను అక్రమ క్రమబద్దీకరణలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. ఇక ప్రస్తుతం తెలంగాణలో మరో 21 కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో.. అగ్రికల్చర్ భూములను కమర్షియల్ భూములుగా మార్చుకోవాలన్న తాపత్రయం స్థానిక బిల్డర్స్ లో పెరిగిపోయింది. కమర్షియల్ భూముల కింద మారిన మరుక్షణం రియల్ ఎస్టేట్ ద్వారా భారీగా డబ్బు దండుకోవాలనేది వారి ప్లాన్. దీంతో అధికారులకు పెద్ద ఎత్తున భూదరఖాస్తులు అందుతున్నాయి.
అయితే ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ ల కమిటీ దరఖాస్తులను పూర్తిగా పరిశీలించి.. సమగ్ర విచారణ చేసిన తర్వాతే వాటిని కమర్షియల్ భూముల కిందకు మార్చేందుకు అనుమతులు ఇస్తోంది. ఇప్పటిదాకా అందిన మొత్తం 200 దరఖాస్తుల్లో కేవలం 95 దరఖాస్తులకు మాత్రమే కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కమర్షియల్ భూములుగా మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్న చాలామంది.. ' షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు, స్కూల్స్, షో రూమ్స్' వంటివి ఆ స్థలంలో ఏర్పాటు చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు. అయితే దరఖాస్తుదారులందరు కేవలం 20శాతం భూమిని మాత్రమే కమర్షియల్ అవసరాల కోసం ఉపయోగించి మిగతా 80శాతాన్ని గృహావసరాల కోసం వినియోగించాలన్న నిబంధన పెట్టింది ప్రభుత్వం. పంట పొలాలకు సంబంధించి ఐదు నుంచి 10 ఎకరాలకు మాత్రమే వ్యవసాయేతర అవసరాల కోసం వినియోగించడానికి ప్రభుత్వం అనుమతిస్తోంది.