ఆశపడ్డోళ్లు ఆగమైపోయిన్రు.. ఎన్నికలు ఏవైనా జనం కారుకే గుద్దిన్రు: కేటీఆర్
''లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ సింగిల్గా తొమ్మిది సీట్లు సాధించి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మిగతా పార్టీలన్నింటినీ కలిపినా మనకంటే తక్కువే వచ్చాయి. అయినాసరే టీఆర్ఎస్ కు ఏదో నష్టం జరిగిపోయినట్లు.. ఇంకేదో జరగబోతున్నట్లు చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అలా ఆశపడ్డోళ్లంతా పంచాయితీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికలతో ఆగమైపోయిన్రు''అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు.
'
ఎన్నిక ఏదైనా సారుదే గెలుపు
తెలంగాణ ఏర్పాటైన తర్వాతి రోజు నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్నే గెలిపిస్తూ వచ్చారని, పంచాయితీ, మండల, జిల్లా, మున్సిపల్, అసెంబ్లీ, పార్లమెంట్ అనే తేడాల్లేకుండా ప్రతి చోటా ప్రజలు టీఆర్ఎస్ కు బ్రహ్మరధం పట్టారని, ఆరేళ్లుగా ఎన్నికల్లో టీఆర్ఎస్ సాధిస్తోన్న విజయాలను చూసి దేశం ముక్కునవేలేసుకునే పరిస్థితి ఉందని కేటీఆర్ చెప్పారు.
బద్ధ శత్రులు ఏకమైనా..
గత అసెంబ్లీ ఎన్నికల్లో బద్ధశత్రువులైన కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటిగా పనిచేశాయని, మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీతో కాంగ్రెస్ కలిసిపోయినా.. ప్రజలు మాత్రం కేసీఆర్ పట్ల విశ్వాసాన్ని చూపారని మంత్రి అన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో 75 శాతం సీట్లు, దాదాపు 50 శాతం ఓట్లు సంపాదించగా, 12,751 గ్రామపంచాయితీలకుగానూ 85 శాతం స్థానాల్లో టీఆర్ఎస్ ను ప్రజలు గెలిపించారని, మున్సిపల్ ఎన్నికల్లోనైతే దాదాపు క్లీన్ స్వీప్ ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు.
కొత్త పాలకమండళ్లతో భేటీ
మరిపెడ, డోర్నకల్, రామాయంపేట, మెదక్, చౌటుప్పల్, కామరెడ్డి, కొల్లాపూర్, నర్సంపేట, హుస్నాబాద్, నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్ లో కొత్తగా ఏర్పడ్డ పాలకమండళ్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను మంత్రి కేటీఆర్ గురువారం తెలంగాణ భవన్ లో కలుసుకున్నారు. కొత్తగా ఎంపికైన అందరికీ ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమలో మంత్రి గంగుల కమలాకర్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.
సీరియస్ వార్నింగ్..
రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు కొత్తగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు.. ఎవరైనా లంచం తీసుకున్నట్లు తెలిస్తే కఠిన చర్యలకు వెనుకాడబోనని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. అవినీతి, అక్రమాలను సహించబోనని.. ఆఖరికి ఎంపీలు, ఎమ్మెల్యేలచేత సిఫార్సులు చేయించినా చర్యలపై వెనక్కి తగ్గబోనని.. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా పనిచేయాలని ఆయన సూచించారు.