తెలంగాణలో ఆర్ఎస్ఎస్ దుమారం: లాక్డౌన్ డ్యూటీలో కార్యకర్తలు: పోలీసుల క్లారిటీ..
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ను నియంత్రించడానికి అమలు చేస్తోన్న లాక్డౌన్ విధుల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తలు పాల్గొంటున్నట్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తిన కొన్ని ఫొటోలు తెలంగాణలో తీవ్ర దుమారాన్ని రేపాయి. రాజకీయ రంగును పులుముకొన్నాయి. అఖిల భారత మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఏఐఎంబీటీ) నాయకులు దీనికి మరింత ఆజ్యాన్ని పోశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల చేతికి అధికారాన్ని ఎవరిచ్చారంటూ విమర్శలు గుప్పించారు.
యాదాద్రి-భువనగిరి చెక్పోస్ట్ వద్ద..
యాదాద్రి-భువనగిరి చెక్పోస్ట్ వద్ద కొందరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు లాక్డౌన్ డ్యూటీల్లో పాల్గొన్నట్లు కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. వాహనాలను నిలిపివేయడం, వారి వద్ద ఉన్న లైసెన్స్, సీ-బుక్, ఇతరత్రా అనుమతి పత్రాలను తనిఖీ చేయడం,లాక్డౌన్ విధించిన సమయంలో రోడ్ల మీదికి ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్నించడం, కొందర్ని వెనక్కి పంపించడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో వారు ఆర్ఎస్ఎస్ ట్రేడ్ మార్క్ తెల్లరంగు చొక్కా, ఖాకీ నిక్కర ధరించి, చేతుల్లో కర్రలను పట్టుకుని కనిపించారు. ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ అయినట్లు పోలీసులు గుర్తించారు.
వద్దని తిప్పి పంపించినా..
లాక్ డౌన్ సమయంలో పోలీసులకు తమవంతు సహాయం చేస్తామని, లాక్డౌన్ డ్యూటీల్లో పాల్గొంటామని కొందరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తమను సంప్రదించగా.. అనుమతి ఇవ్వలేదని తెలిపారు. అయినప్పటికీ అనుమతి లేకుండా ఈ సారి నేరుగా రోడ్ల మీదికి వచ్చి లాక్డౌన్ డ్యూటీల్లో పాల్గొని ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు చెప్పారు. వాహనాలు ఆపే అధికారం గానీ, డాక్యుమెంట్లను తనిఖీ చేసే అధికారం గానీ పోలీసులు, సంబంధిత శాఖ సిబ్బందికి తప్ప మరెవరికీ లేదని స్పష్టం చేశారు.
మరిన్ని అధికారాలు ఇస్తారా? ఎంబీటీ ఆరోపణలు..
ఈ ఘటన పట్ల ఎంఐఎం నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుని విమర్శలు గుప్పించారు. సెక్యులర్ ముసుగులో హిందుత్వాన్ని అమలు చేస్తోందని ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లా ఖాన్ విమర్శించారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల చేతికి లాఠీలను ఇచ్చిన తెలంగాణ సర్కార్.. భవిష్యత్తులో మరిన్ని అధికారాలను అప్పగించినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆరోపించారు.
పోలీసులు ఏం చెబుతున్నారంటే..
దీనిపై తెలంగాణ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎలాంటి అనుమతులు లేకుండా లాక్డౌన్ డ్యూటీల్లో పాల్గొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆయన స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా వారంతట వారే వాహనాలను తనిఖీ చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు. వారిపై చట్టపరమైన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు.