సిట్ తదుపరి టార్గెట్ వారే?: ప్లాన్ రెడీ.. రహస్య విచారణకే మొగ్గు..
అయితే చార్జిషీట్లలో ఎవరిని సాక్ష్యులుగా పేర్కొంటారు?.. నిందితులుగా ఎవరిని పేర్కొంటారు? అన్నది తేలాల్సి ఉంది.
హైదరాబాద్: అయిపోయింది.. నిన్న మొన్నటిదాకా ఆబ్కారీ భవన్ వద్ద కనిపించిన హడావుడికి నేటితో తెరపడింది. సినీ తారల సిట్ విచారణతో పండుగ చేసుకున్న మీడియాకు కూడా ఇక మసాలా కరువైనట్లే కనిపిస్తోంది. అయితే డ్రగ్స్ వ్యవహారంలో సిట్ పాత్ర ఇక్కడితో పూర్తయినట్లేనా?.. మరేమైనా ఆసక్తికర మలుపులు చోటు చేసుకుంటాయా? అన్నది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.
3 గంటల్లో ముగిసిన నందు విచారణ: వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు అలాగే
సినీ ప్రముఖుల విచారణ ముగియడంతో.. ప్రస్తుతం ఐటీ కంపెనీలపై సిట్ ఫోకస్ పెట్టింది. దాదాపు 10 కంపెనీల్లో డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించిన 21మందికి నోటీసులు జారీ చేసింది. అయితే వీరందరిని రహస్యంగా విచారించాలా?.. లేక సినీ ప్రముఖుల లాగే ఆబ్కారీ భవన్ లో విచారించాలా? అన్నదానిపై సిట్ మీమాంసలో ఉంది.
ఐటీ కంపెనీల సలహా అది:
నిజానికి ఆయా కంపెనీల భవనాల్లోనే డ్రగ్స్ బాధితులను విచారించాలని సిట్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. లేదా హైటెక్స్ ప్రాంతంలో రహస్యంగా విచారణ చేపట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు. అయితే ఆయా కంపెనీలు మాత్రం.. ఈ రెండూ కాకుండా మరేదైనా అనువైన ప్రాంతం ఎంచుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.
Recommended Video
రూట్ మార్చారు:
మొత్తానికి నిన్న మొన్నటిదాకా సాగిన విచారణ తరహాలో కాకుండా.. ఐటీ ఉద్యోగుల ఇంటరాగేషన్ పూర్తిగా రహస్య పద్దతిలో నిర్వహించాలని సిట్ భావిస్తోంది. సాధారణ విచారణకు పూర్తి భిన్నంగా వీరిని విచారించడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఐటీ ఉద్యోగుల విచారణ అనంతరం.. మూడో విడతలో ఇన్వెస్టర్లు, బడాబాబుల పిల్లలు, మరికొందరు రియల్టర్లను, సినీ ఫైనాన్షియర్లను సిట్ విచారించే అవకాశం ఉంది.
ఉద్యోగులను తొలగించవద్దని:
డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకున్న ఉద్యోగులను తొలగించవద్దని ఆయా కంపెనీలకు సిట్ సూచించింది. వారిని బాధితులుగానే చూడాలనే పేర్కొంది. విచారణ సమయంలో ఆయా కంపెనీల ప్రతినిధులను కూడా పిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఐటీ ఉద్యోగుల్లో కొందరు మానసిక ఒత్తిడిని తట్టుకోలేకే డ్రగ్స్ వాడుతున్నట్లు తేలగా.. మరికొందరు మాత్రం కళ్లుచెదిరే జీతాలు తీసుకుంటూ దాన్నో వ్యసనంగా మార్చుకున్నట్లు గుర్తించారు. ఐటీ ఉద్యోగుల విచారణకు సంబంధించి మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
చార్జిషీట్లు సిద్దం:
సినీ ప్రముఖుల విచారణ పూర్తవడంతో.. వారి విచారణకు సంబంధించి చార్జిషీట్లను అధికారులు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. చార్జిషీట్లలో డ్రగ్స్ కు సంబంధించి ఆయా వ్యక్తులు జరిపిన ఫోన్ సంభాషణలను కూడా పొందపరుచనున్నారు. కెల్విన్, జీషన్ అలీ ఫోన్ కాల్స్, సినీ ప్రముఖులతో వారి ఫోటోలను జతచేయనున్నారు. అయితే చార్జిషీట్లలో ఎవరిని సాక్షులుగా పేర్కొంటారు?.. నిందితులుగా ఎవరిని పేర్కొంటారు? అన్నది తేలాల్సి ఉంది.