మొదలైన సకల నేరస్తుల సమగ్ర సర్వే, పాత నేరస్తుల ప్రవర్తనపై క్షేత్రస్థాయిలో ఆరా..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసులు వినూత్న సర్వే ఒకటి చేపట్టారు. నేరస్తుల వివరాలు అడపాదడపా సేకరించడానికి భిన్నంగా.. ఏకంగా వారి లెక్కతేల్చేందుకు సర్వే మొదలుపెట్టారు.
దీనికి 'సకల నేరస్తుల సమగ్ర సర్వే'గా పేరుపెట్టారు! అంతేకాదు... ప్రతి నేరస్తుడి సమాచారాన్ని పోలీసులు జియో ట్యాగింగ్ చేస్తున్నారు. గతంలో హైదరాబాద్లో విజయవంతమైన ఈ సర్వే గురువారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా మొదలైంది.
పాత నేరస్తుల నడవడికపై ఆరా...
సకల నేరస్తుల సమగ్ర సర్వేలో భాగంగా రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో గత పదేళ్లలో నేర చరిత్ర కలిగిన పాత నేరస్తుల నివాసాలకు వెళ్లి వారి ప్రవర్తన, నడవడికపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హోంగార్డు నుంచి డీజీపీ వరకు ప్రతి ఒక్కరూ ఈ సర్వేలో పాల్గొని వివరాలు సేకరిస్తున్నారు. పోలీసు రికార్డుల్లో ఉన్న నేరస్తులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారనే వివరాలను అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తున్నారు.
నేరస్తుల వివరాలు బిగ్ డేటాబేస్లోకి...
పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ సర్వే చేపట్టారు. నేరస్తుల పూర్తి వివరాలను బిగ్ డేటాబేస్లో పొందుపరుస్తున్నారు. నేరగాళ్ల ఫొటోలు, వేలి ముద్రలు తీసుకోవడం తదితర విధానాలతో డేటా సేకరిస్తున్నారు. ఈ వివరాలన్నీ క్రైం డేటా ఎనాలసిస్ యూనిట్ ద్వారా తెలంగాణ కాప్ యాప్కు అనుసంధానం చేస్తారు. ఏదైనా నేరం జరిగినప్పుడు పాత కేసుల్లో నిందితులను గుర్తించేందుకు ఈ డేటా ఉపయోగపడుతుంది.
ముఖ్య నేరస్తుల ఇళ్లకు జియో ట్యాంగింగ్..
సకల నేరస్థుల సమగ్ర సర్వేలో భాగంగా ముఖ్య నేరస్తుల ఇళ్లను జియో ట్యాగింగ్తో అనుసంధానం చేస్తున్నారు. ఇందుకోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు ఉపయోగిస్తున్నారు. మొత్తంమీద రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి నేరాలకు పాల్పడినా వెంటనే దొరికిపోతామనే భయాన్ని నిందితుల్లో కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
పూర్తిస్థాయిలో నేరాల అదుపు కోసమే...
రాష్ట్రానికి పెట్టుబడులు అధికంగా రావడంలో ముఖ్యభూమిక పోషిస్తున్న శాంతిభద్రతల విషయంలో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. సకల నేరస్తుల సమగ్ర సర్వేలో భాగంగా పోలీసు అధికారులతో సమావేశమైన ఆయన వారికి కీలక సూచనలు చేశారు. నేరాలను పూర్తి స్థాయిలో అరికట్టాలనే ఉద్దేశంతో నేరస్తుల సమగ్ర సర్వే నిర్వహిస్తోన్నట్లు చెప్పారు. ప్రతి నేరస్తుడి వివరాలు నమోదు చేయాలని డీజీపీ సూచించారు. నేరస్తుల వివరాలను జియో ట్యాగింగ్ ద్వారా సమీకృతం చేయాలని చెప్పారు.