తెలంగాణ పోలీసుపై తగ్గని డిగ్గీ: క్షమాపణకు వెంకయ్య డిమాండ్, మాగంటి ఫిర్యాదు
ట్విట్టర్ వేదికగా తెలంగాణ పోలీసులపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు.
ఢిల్లీ/హైదరాబాద్: ట్విట్టర్ వేదికగా తెలంగాణ పోలీసులపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులు ఐఎస్ఐఎస్కు సంబంధించిన ఫేక్ వెబ్సైట్ను రూపొందించారని అన్నారు. దీని ద్వారా ఉగ్రవాదుల్లో చేరేందుకు ముస్లిం యువతను ప్రొత్సహిస్తున్నారని ఆరోపించారు.
ఆ సైట్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగానే....తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఉత్తరప్రదేశ్లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాది సైఫుల్లాఖాన్ ఎన్కౌంటర్ జరిగిందని ఆయన వెల్లడించారు. ముస్లిం యువకుల ద్వారానే ఐఎస్ఐఎస్కు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ పోలీసులు సేకరించారని ఆయన చెప్పారు.
Unfounded allegations from a senior responsible leader will lower the morale and image of Police engaged in fighting anti-national forces https://t.co/vzR8dfVldc
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) May 1, 2017
అయితే, తన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ఖండించారు కానీ, తెలంగాణ పోలీసులు ఖండించలేదని ఆయన గుర్తు చేశారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని ఆయన సూచించారు. తెలంగాణ పోలీసుల ఈ చర్యలకు సీఎం కేసీఆర్ మద్దతు కూడా ఉందా? అని డిగ్గీ ప్రశ్నించారు.
I agree but what about the Telangana Police which is posting inflammatory postings to radicalise Muslim Youth through their fake ISIS site?
— digvijaya singh (@digvijaya_28) May 1, 2017
కాగా, తెలంగాణ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ సింగ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ కూడా డిగ్గీ ఆరోపణలపై స్పందించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీనియర్ నాయకులు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. అసాంఘిక శక్తులతో నిరంతరం పోరాటం చేస్తున్న పోలీసులను అనుమానించడం తగదని హితవు పలికారు.
డిగ్గీపై జూబ్లీహిల్స్లో ఫిర్యాదు
తెలంగాణ రాష్ట్ర పోలీసులను కించపరిచేలా ట్విటర్లో వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్సింగ్పై జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో ఎమ్మెల్యే మాగంటి ఫిర్యాదు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, తక్షణమే క్షమాపణ చెప్పాలని మాగంటి గోపీనాథ్రెడ్డి అన్నారు.హైదరాబాద్లో శాంతియుత వాతావరణం ఉందన్నారు. బాధ్యతాయుతమైన నేతగా ఉండి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం ఆయనకు తగదన్నారు.
క్షమాపణలు చెప్పండి: వెంకయ్య
తెలంగాణ పోలీసులపై వివాదాస్పద ఆరోపణలు చేసిన దిగ్విజయ్ సింగ్ సరైన ఆధారాలు చూపాలని లేదంటే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. తెలంగాణ పోలీసులపై డిగ్గీ నిరాధార ఆరోపణలు తమను దిగ్భ్రాంతికి గురిచేశాయన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు పోలీసుల ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీస్తాయని అన్నారు. డిగ్గీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.