నిన్న ఏపీ..నేడు తెలంగాణ: పోలీసులకు వీక్లీ ఆఫ్ షురూ చేసిన కేసీఆర్ సర్కార్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో పోలీసులకు వారాంతపు సెలవు ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. తాజాగా తెలంగాణలో కూడా పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీసులు 24 గంటలు పనిచేసి ఒత్తిడికి లోనవుతున్నారని భావించిన కేసీఆర్ సర్కార్... వారికి శుభవార్త తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ పోలీసులకు వారాంతపు సెలవును ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసింది.
ఇక పోలీసులకు వారాంతపు సెలవును మరో మూడు రోజుల్లో అమలు చేయనున్నట్లు నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డి తెలిపారు. ఇప్పటికే అన్ని జిల్లాల యూనిట్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు నాగిరెడ్డి తెలిపారు. అయితే ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. నార్త్జోన్తో పాటు వెస్ట్జోన్కు కూడా ఇంచార్జిగా ఐజీ నాగిరెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ ఒక పద్ధతిగా జరగాలని ఆయన సూచించారు. పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పోలీసుల సంఖ్య పరిగణలోకి తీసుకుని రోజుకు ఇద్దరికి లేదా ముగ్గురికి వీక్లీ ఆఫ్ ఇవ్వాలని ఐజీ నాగిరెడ్డి సూచించారు.
Recommended Video
వీక్లీ ఆఫ్ ఎవరికి ఏ రోజు కావాలో వారే ఎంపిక చేసుకునేలా ఉండాలని నాగిరెడ్డి తెలిపారు. ఒకవేళ ఒకేరోజు చాలామందికి వారాంతపు సెలవు కావాలని పోటీపడితే లాటరీ పద్దతి ద్వారా వీక్లీ ఆఫ్ ఇవ్వాలని నాగిరెడ్డి ఆయా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చారు. డ్యూటీ రోస్టర్ చార్ట్లో ఒక ప్రత్యేక కాలమ్ను పెట్టి, రోజుకు ఇద్దరు లేదా ముగ్గురికి వారాంతపు సెలవు కేటాయించుకోవాలని ఆదేశించారు. రెండ్రోజుల్లోగా వారాంత సెలవులపై కేటాయింపు పూర్తి చేసి ఎవరు ఏ రోజున సెలవుపై ఉంటారో అనే డీటెయిల్స్ను ముందుగానే సేకరించుకోవాలని జిల్లా ఎస్పీలకు ఐజీ నాగిరెడ్డి ఆదేశించారు. ఈ పూర్తి సమాచారాన్ని కూర్పు చేసి చీఫ్ ఆఫీసర్కు పంపాలని ఆదేశించారు.