శభాష్ పోలీస్.. 30 సెకన్లలో మిస్సింగ్ కేసు ట్రేస్
హైదరాబాద్ : కనిపించకుండా పోయినవారు తిరిగొచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఇంట్లో నుంచి పారిపోయినవారు లేదంటే తప్పిపోయినవారు కుటుంబ సభ్యుల చెంతకు చేరడం గగనమే. కొలిక్కిరాని మిస్సింగ్ కేసులు సవాలక్ష ఉంటున్న తరుణంలో తెలంగాణ పోలీసులు ఓ అడుగు ముందుకేశారు. రెండేళ్ల కిందట కనిపించకుండా పోయిన ఓ బాలిక కేవలం 30 సెకన్లలో ట్రేస్ కావడంతో శభాష్ అనిపించుకుంటున్నారు.
దర్పణ్.. ఇదొక యాప్. కాస్తా వివరంగా చెప్పాలంటే ఫేస్ రిక్నగిషన్ టూల్. తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేకంగా దీన్ని రూపొందించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా మిస్సయిన పిల్లల ఆచూకీ కనుగొనే గొప్ప ప్రయత్నం జరుగుతోంది. ఈక్రమంలో రెండేళ్ల కిందట అసోం రాష్ట్రంలో కనిపించకుండా పోయిన బాలికను కేవలం 30 సెకన్ల వ్యవధిలో గుర్తించడమే గాకుండా ఆమె తల్లిదండ్రుల చెంతకు చేర్చడం విశేషం.
అసలేం జరిగింది..!
అసోం లోని లఖిమ్ పూర్ ఏరియాకు చెందిన అంజలి టిగ్గా అనే పదేహారేళ్ల బాలిక ఇంట్లోంచి పారిపోయి ఢిల్లీకి వెళ్లింది. ఆమె కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కొన్నిరోజులకే ఢిల్లీ నుంచి అసోం చేరుకున్న ఆ బాలిక.. తల్లిదండ్రులు తిడతారనే భయంతో ఇంటికి వెళ్లలేకపోయింది. సొనిత్ పూర్ లోని ఓ ఇంటిలో పనికి కుదిరింది. అయితే ఒకానొక సందర్భంలో రైల్వే పోలీసులు ఆమెను బాలకార్మికురాలిగా గుర్తించి తేజ్ పూర్ లోని ఛైల్డ్ కేర్ సెంటర్ కు తరలించారు.
దర్పణ్ యాప్.. ఫేస్ రికగ్నిషన్ టూల్
ఇటీవల ఫేస్ రికగ్నిషన్ టూల్ "దర్పణ్ యాప్" గురించి తెలుసుకున్న అక్కడి ఛైల్డ్ కేర్ సెంటర్ నిర్వాహకులు తెలంగాణ పోలీసులను సంప్రదించారు. దీంతో ఆ బాలిక ఫోటో సదరు యాప్ లో సెర్చ్ చేయడంతో మిస్సింగ్ కేసు తాలూకు వివరాలు 30 సెకన్లలో తెలిసిపోయాయి. దీంతో అసోం పోలీసులకు పూర్తి వివరాలతో సమాచారం అందించారు. ఆదివారం నాడు అక్కడి పోలీసులు బాలిక తల్లిదండ్రులను పిలిపించి ఛైల్డ్ కేర్ సెంటర్ కు తీసుకెళ్లారు.
స్వాతి లక్రా ట్వీట్
ఈ ఏపిసోడ్ పై తెలంగాణ ఐజీ స్వాతి లక్రా స్పందించారు. తల్లిదండ్రులను చూడగానే అంజలి ఉద్వేగానికి గురైందని ట్వీట్ చేశారు. మిస్సింగ్ కేసుల దర్యాప్తులో ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని కొనియాడారు. ఆయా రాష్ట్రాల పోలీసులతో పాటు స్టేట్ హోమ్, రెస్క్యూ హోమ్ నిర్వాహకులు ఈ యాప్ ను వినియోగించుకుంటున్నట్లు సమాచారం. మిస్సయిన చిన్నారులను ట్రేస్ చేయడమే కాదు కరడుగట్టిన నేరస్థులను కూడా ఈ యాప్ తో పట్టుకోవచ్చట.