హుజుర్నగర్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి డిక్లేర్.. టీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవితనా?
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలు ఇప్పటికే హాట్హాట్గా మారాయి. టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తుల బెడద మిగతా పార్టీలను అలర్ట్ చేస్తోంది. ఇదే అదనుగా అసంతృప్త గళాలు వినిపిస్తున్న గులాబీ నేతలను ఆకర్షించడానికి బీజేపీ నేతలు ముందున్నారు. ఇక యురేనియం తవ్వకాలపై రచ్చ చేయాలని చూస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ క్రమంలో హుజుర్ నగర్ ఉప ఎన్నిక చర్చానీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించగా.. టీఆర్ఎస్ నుంచి ఇంతవరకు ఎలాంటి సౌండ్ లేదు. దాంతో భిన్న రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితను అక్కడి నుంచి రంగంలోకి దించనున్నారనే టాక్ జోరందుకుంది.
హుజుర్ నగర్ ఉప ఎన్నిక హాట్ టాపిక్
తెలంగాణ రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారిన వేళ హుజుర్ నగర్ ఉప ఎన్నిక మరింత హాట్ టాపిక్గా మారింది. మంత్రివర్గ విస్తరణతో టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్త జ్వాలలు ఎగిసి పడుతుంటే.. ఇప్పుడు బై ఎలక్షన్ ప్రాధాన్యత సంతరించుకుంది. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్ నగర్ స్థానం నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే క్రమంలో అటు నల్గొండ ఎంపీగా కూడా విజయం సాధించారు. దాంతో ఎంపీగా కొనసాగడానికి సిద్ధమైన ఉత్తమ్.. హుజుర్ నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయాల్సి వచ్చింది.
లక్షకు పైగా ఉద్యోగాలకు కేబినెట్ ఆమోదం.. ప్రతిపక్షాల కేసుల వల్లే ఆలస్యం.. బడ్జెట్పై సీఎం వివరణ..!
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖరారు
ఉత్తమ్ రాజీనామాతో హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థిని ప్రకటించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతిని హుజుర్ నగర్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా పేరు ఖరారు చేశారు. ఆ మేరకు సూర్యాపేట జిల్లా చింతల పాలెం మండలంలోని నక్కగూడెంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ఉత్తమ్. అసెంబ్లీ సెగ్మెంట్లోని కార్యకర్తల అభిప్రాయం మేరకు పద్మావతిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించినట్లు తెలిపారు ఉత్తమ్. ఆమెను అభ్యర్థిగా ప్రకటించడంలో ముమ్మాటికీ కార్యకర్తల అభిప్రాయం పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
ముందస్తుగా అభ్యర్థి డిసైడ్.. ప్రచారంలో దూకుడు పెంచడానికేనా?
హుజుర్ నగర్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు క్లారిటీ ఇచ్చేశారు. తమ అభ్యర్థిని ప్రకటించడంతో ఇక ఎన్నికల సమరానికి సై అంటున్నారు. అయితే అధికార పక్షమైన టీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు అభ్యర్థిని డిసైడ్ చేయలేదు. అటు బీజేపీ కూడా తమ క్యాండిడేట్ను ప్రకటించలేదు. ముందస్తుగానే కాంగ్రెస్ పెద్దలు తమ అభ్యర్థిని ప్రకటించడం వెనుక ఆంతర్యమేంటోననే వాదనలు లేకపోలేదు. చివరి నిమిషంలో తర్జన భర్జన పడి అభ్యర్థిని ప్రకటించేదాని కంటే ముందుగానే డిసైడ్ చేస్తే ప్రచారం సులువు అవుతుందనేది ఆ పార్టీ నేతల అంతరంగంగా కనిపిస్తోంది.
టీఆర్ఎస్ నుంచి ఎవరు.. కల్వకుంట్ల కవితకేనా ఛాన్స్..!
కాంగ్రెస్ అభ్యర్థిగా హుజర్ నగర్ ఉప ఎన్నికకు పద్మావతిని డిక్లేర్ చేయడంతో.. అటు టీఆర్ఎస్ నుంచి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూతురు, నిజామబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పేరు చక్కర్లు కొడుతోంది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీచేసిన కవితకు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ గట్టి షాక్ ఇచ్చారు. ఆమె మీద ఆయన సునాయసంగా గెలవడంతో కవిత భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఆ ఎన్నికల ఫలితాల తర్వాత కవిత ఎక్కడ కూడా అంత యాక్టివ్గా కనిపించిన దాఖలాలు లేవు.
కేసీఆర్ కుటుంబ పాలన.. బీజేపీ డోర్లు తెరిస్తే టీఆర్ఎస్ ఎంపీలు కారులో ఉంటారా? : రఘునందన్
కేసీఆర్ ఆలోచన ఏంటో మరి..!
కూతురును హుజుర్ నగర్ నుంచి పోటీ చేయించి తదనంతరం అక్కడ గెలిపించి కేబినెట్లోకి తీసుకోవాలనేది కేసీఆర్ అంతరంగంగా కనిపిస్తోందనే ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ కంచుకోటగా పేరొందిన హుజుర్ నగర్లో కూడా పొరపాటున కవిత ఓడిపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందనేది మరో కోణంలో కేసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆమెకు నామినేటేడ్ పోస్టు ఇచ్చి పార్టీలో యాక్టివ్ చేయాలా.. లేదంటే హుజుర్ నగర్ బరిలో దించి తాడో పేడో తేల్చుకోవాలా అనే యాంగిల్లో కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మహిళకు టికెట్ ఇవ్వడంతో.. అదే సాకుతో టీఆర్ఎస్ కూడా కవితను రంగంలోకి దించుతుందేమోననే వాదనలు వినిపిస్తున్నాయి.