ఆనాడు బీజేపీకి సై.. ఈనాడు టీఆర్ఎస్కు జై..! కాంగ్రెస్ రాజగోపాల్ మనసులోని మర్మమేంటో..!!
యాదాద్రి : రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తులు సహజం, సర్వసాధారణం. ఆ క్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పక్కా పొలిటిషియన్గా కనిపిస్తున్నారు. మొన్నటికి మొన్న బీజేపీలో చేరకుండానే సొంత గూటి పెద్దలను తికమక పెట్టిన రాజగోపాలుడు ఈసారి టీఆర్ఎస్ పార్టీపై పొగడ్తల వర్షం కురిపించారు. అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి అల్టర్నేట్ బీజేపీయేనంటూ వ్యాఖ్యలు చేసి.. ఇప్పుడేమో ప్రజలు గులాబీ పార్టీనే నమ్ముతున్నారంటూ మాట్లాడటం కొసమెరుపు. మొత్తానికి ఆయన వ్యూహమేంటో.. మనసులోని మర్మమేంటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. కాంగ్రెస్ గూటిలో ఉంటూ ఇతర పార్టీలకు జై కొడుతున్న తీరు చర్చానీయాంశంగా మారింది.
టీఆర్ఎస్ పార్టీని పొగిడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నియోజకవర్గ పరిధిలోని దండు మల్కాపూర్లో మంత్రి కేటీఆర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్పై ప్రశంసల జల్లు కురిపించారు. మునుగోడు ప్రజల తరపున మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ లాంటి అనుభవం, అవగాహన ఉన్న వ్యక్తి పరిశ్రమల శాఖ మంత్రి కావడం మన అదృష్టమని వ్యాఖ్యానించారు. అంతేకాదు పనిలో పనిగా టీఆర్ఎస్కు కూడా కితాబిచ్చారు. ప్రజలు ఆ పార్టీని నమ్ముతున్నారు కాబట్టే రెండోసారి అధికారం కట్టబెట్టారని చెప్పుకొచ్చారు.
హయత్నగర్ టు ఆమంగల్.. కీర్తి రెడ్డికి అబార్షన్ చేసిందెవరు.. తల్లి హత్య కేసులో మరో కోణం..!
నల్గొండ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్కు పెట్టింది పేరు..!
నల్గొండ జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆరితేరారు. కాంగ్రెస్ పార్టీ లీడర్లుగా జనంతో మమేకమయ్యారు. ఆ క్రమంలో వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ కూడా ప్రజాప్రతినిధులుగా సేవలందిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరూ పోటీ చేసినప్పటికీ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అన్న వెంకటరెడ్డి మాత్రం ఓటమి చవిచూశారు. అయితే ఆ తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీగా విజయం సాధించారు వెంకటరెడ్డి. అయితే ఇటీవల రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్న తీరు కాంగ్రెస్ పెద్దలను షేక్ చేస్తోంది. హస్తం గూటిలో ఉంటూ అప్పట్లో బీజేపీకి సై అనడం.. ఇప్పుడేమో టీఆర్ఎస్ పార్టీని పొగడటం.. ఇదంతా కూడా మింగుడు పడని అంశంలా మారింది.
ఆ మధ్య టీఆర్ఎస్ పార్టీని తిట్టి.. బీజేపీకి సై అంటూ..!
ఆ మధ్య టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు రాజగోపాల్ రెడ్డి. రాష్ట్రంలో గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయం కాషాయ పార్టీయే అంటూ ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ.. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. అంతేకాదు సొంత గూటి నేతలపై ఓ రేంజ్లో ఫైరయ్యారు. టీపీసీసీ చీఫ్గా ఇన్నాళ్లు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పగ్గాలు అప్పగించడం వల్లే కాంగ్రెస్ కోలుకోవడం లేదని ఆరోపించారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకుంటే పార్టీ పెద్దలు ఎందుకు నిలువరించలేక పోయారని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి అలా మాట్లాడటంపై కాంగ్రెస్ నేతలు షోకాజ్ నోటీసులు ఇస్తామనడంతో మరింత ఆగ్రహానికి గురయ్యారు. తనకు నోటీసులు ఇచ్చే నైతిక అధికారం టీపీసీసీకి లేదని ధ్వజమెత్తారు.
అప్పుడేమో బీజేపీకి సై.. ఇప్పుడేమో టీఆర్ఎస్కు జై..!
రాజగోపాల్ రెడ్డి అప్పట్లో బీజేపీకి అనుకూలంగా మాట్లాడినట్లు కనిపించడంతో ఆయన పార్టీ మారతారేమోననే ఊహాగానాలు వినిపించాయి. కానీ అది జరగలేదు. మరో సందర్భంలో బీజేపీలో చేరకముందే ఆ పార్టీ నుంచి తాను భవిష్యత్తు సీఎం అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. అంతేకాదు రెండేళ్లలో రాష్ట్రంలో అనూహ్య మార్పులు జరుగుతున్నాయని.. రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయంటూ జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ అధికారం కోల్పోవడం ఖాయమన్నట్లుగా ఆనాడు ఆయన మాట్లాడిన తీరు పొలిటికల్ సర్కిల్లో ఇంకా ఎవరూ మరిచిపోలేదు. అంతలా అగ్రెసివ్గా మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి నాలుగైదు నెలల్లోనే స్వరం మార్చడం మరోసారి హాట్ టాపికైంది.
అనంతలో భారీ చోరీ.. ఒక్క దొంగ కోసం వెయ్యి మంది పరుగులు.. చివరకు..!
రాజగోపాల్ మనసులో ఏముందో మరి..!
అప్పుడు బీజేపీకి వకాల్తా పుచ్చుకుని మాట్లాడినట్లుగా కనిపించిన రాజగోపాల్ రెడ్డి ధోరణి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వైపు ఎందుకు మళ్లిందనేది ప్రశ్నార్థకమే. కాంగ్రెస్లో ఉంటూ కూడా బీజేపీ గురించి ఎంత గొప్పగా మాట్లాడినా.. ఆ పార్టీలో చేరాలని ఆహ్వానం రాకపోవడం కారణమనే వాదనలు లేకపోలేదు. ఇంత కాలం వేచి చూసి కాషాయం నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాక చివరకు టీఆర్ఎస్ వైపు చూస్తున్నారేమోననే అనుమానం కలుగుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభంజనంతో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని పరిస్థితి ఉందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.
అందుకే ఆ పార్టీలో ఉంటే నియోజకవర్గ అభివృద్ధి కూడా శూన్యమనే ధోరణితోనే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభోత్సవంలో టీఆర్ఎస్కు అనుకూలంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడి ఉండొచ్చనేది ఒక కోణంగా కనిపిస్తోంది. మొత్తానికి ఆయన పార్టీ మారుతారా లేదా అన్నది పక్కనబెడితే ఆనాడు బీజేపీకి సై.. ఈనాడు టీఆర్ఎస్కు జై అనడంలో అసలు అంతరంగం ఏంటన్నది మున్ముందు చూడాల్సిందే.