ఇంత జరిగిందా: తెరాస, తెలంగాణ టిడిపి ఒక్కటవుతున్నాయా?
తెరాసతో పొత్తు కోసం తెలంగాణ టిడిపి ఉవ్విళ్లూరుతున్నట్లు సమాచారం. ఇందుకు గాను కొద్ది మంత్రులు, ఓ మీడియా బాస్ కెసిఆర్తో విందు సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు కీలకమైన మలుపు తిరగబోతున్నాయా, తెలంగాణ తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్కటవుతున్నాయా? అవుననే అంటోంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా కథనం. ఇందుకు గాను పూర్తి స్థాయిలో కసరత్తు, రహస్యభేటీలు జరుగుతున్నట్లు ఆ వార్తాకథనం తెలియజేస్తోంది.
తెలంగాణలో నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో తెరాసతో పొత్తు పెట్టుకుని తిరిగి జవజీవాలు పొందాలనే ఎత్తుగడతో టిడిపి ఉన్నట్లు చెబుతున్నారు. తెరాసతో పొత్తు కోసం టిడిపి నుంచే ప్రతిపాదన వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయంటూ సాక్షి మీడియా రాసింది.
ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువు ఉన్నప్పటికీ వలసలను నివారించే ఉద్దేశంతో టిడిపి ఆ ప్రతిపాదన చేసినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు దగ్గరైన ముగ్గురు, ఓ మీడియా బాస్ ఇందుకు ప్రయత్నాలు సాగించినట్లు, వారు కెసిఆర్తో సమావేశమైనట్లు ఆ వార్తాకథనం తెలియజేస్తోంది. ఆ వార్తాకథనం విశేషాలు ఈ విధంగా ఉన్నాయి.
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు నాయకత్వం
తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన పొత్తు ప్రతిపాదన కార్యరూపం దాల్చాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరుకుంటున్నారు. దాంతో కెసిఆర్తో సమావేశానికి ఆయన చొరవ చూపారని సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆ తర్వాత తెరాసలో చేరి మంత్రిపదవిని చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో విజయానికి టిడిపి పొత్తు అత్యవసరమని, తనను నమ్మి వచ్చిన ఎంపి మళ్లీ గెలువాలంటే కూడా అది అవసరమని భావిస్తున్నారు. దాంతో కెసిఆర్తో విందు సమావేశానికి ఆయన ఒప్పించినట్లు తెలుస్తోంది.
కెసిఆర్తో విందు సమావేశం ఇలా...
కెసిఆర్తో విందు సమావేశానికి తెలంగాణ టిడిపి నేత, నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కెసిఆర్తో సన్నిహిత సంబంధాలున్న రాయలసీమకు చెదిన ఓ ఎపి మంత్రి, మీడియా బాస్ హాజరయ్యారని చెబుతున్నారు. గతంలో తమకు కెసిఆర్తో ఉన్న సన్నిహిత సంబంధాలను ఆసరా చేసుకుని పొత్తు ప్రతిపాదన చేసినట్లు సాక్షి రాసింది. తెలంగాణలో కాంగ్రెసు లాభపడకూడదని, కాంగ్రెసు లాభపడితే తమ ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని భావించి టిడిపి నేతలు ఈ పొత్తు ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. విందు సమావేశంలో పొత్తు ప్రతిపాదనపై చర్చ సాగినప్పటికీ కెసిఆర్ మాత్రం తన అభిప్రాయాన్ని చెప్పలేదని సమాచారం.
రమణ తెరాసలో చేరడానికి ముందే...
తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ తెరాసలో చేరడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకే ఆయన తెరాసలో చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఇటీవల సమావేశమైనట్లు తెలుస్తోంది. రమణ చేరితే చాలా మంది తెరాసలోకి దుమికే అవకాశం ఉందని టిడిపి నాయకత్వం ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో వలసలను నిరోధించడానికి పొత్తు ప్రతిపాదనను ఇంత ముందుగా తెర మీదికి తెచ్చినట్లు చెబుతున్నారు. కనీసం పది శాతం ఓట్లు ఉన్న టిడిపి ఉనికి కోల్పోతే కాంగ్రెసు ఆ మేరకు లాభపడుతుందని కెసిఆర్ అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో కెసిఆర్ తమ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్నారని టిడిపి నాయకులు అంటున్నారు.
బిజెపితో కూడా కలిసి పనిచేస్తే...
అవసరమైతే బిజెపిని కూడా కలుపుకుని వెళ్తే బాగుంటుందని విందు సమావేశంలో ఓ ప్రతిపాదన వచ్చినట్లు చెబుతున్నారు. అయితే, దాని గురించి బిజెపి కేంద్ర నాయకత్వంతో మాట్లాడాల్సి ఉంటుందని, ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువు ఉన్న నేపథ్యంలో ఇప్పుడే దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కెసిఆర్ అన్నట్లు సమాచారం. దానివల్లనే ప్రస్తుతానికి టిడిపి నుంచి తెరాసలోకి వలసలు ఆగిపోయినట్లు చెబుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు, కెసిఆర్ అవకాశం ఉన్న ప్రతిసారీ కలుసుకుంటున్నారు. వారిద్దరు గత వైరాన్ని మరిచి సానుకూల వాతావరణంలో ఉల్లాసంగా మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో ప్రధాని మోడీకి కెసిఆర్ దగ్గరవుతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు మోడీతో కలిసి పనిచేస్తున్నారు.
ఎర్రబెల్లితో ఎల్. రమణ రహస్య భేటీ
ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఎపి మంత్రి నారాయణ నివాసంలో ఎల్. రమణ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మరో తెలంగాణ టిడిపి నేత రావుల చంద్రశేఖర రెడ్డి కూడా పాల్గొన్నట్లు చెబుతున్నారు. ఈ భేటీ వివరాలు మాత్రం బయటకు పొక్కలేదు. అదే రోజు ఎల్. రమణ, ఎర్రబెల్లి ముఖ్యమంత్రి కెసిఆర్తో సమావేశమైనట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్. రమణ తెరాసలో చేరడం ఆగిపోయిందని అంటున్నారు. పొత్తు ప్రతిపాదన కారణంగానే టిడిపి నుంచి తెరాసలోకి వలసలు ఆగిపోయినట్లు చెబుతున్నారు.
తెరాసపై దూకుడు తగ్గించిన రేవంత్ రెడ్డి
కెసిఆర్పై, కెసిఆర్ కటుుంబంపై నిప్పులు చెరుగుతూ వచ్చిన రేవంత్ రెడ్డి ఇటీవల తన దూకుడు తగ్గించారు. రేవంత్ రెడ్డి వైఖరిపై విసిగిపోయిన సీనియర్లు తెరాస బాట పట్టారనే ప్రచారం ఉంది. ఎల్ రమణతో ఎర్రబెల్లి భేటీని కూడా ఆయన రాజకీయం చేశారు. అయితే, తెరాసతో టిడిపి పొత్తు అంత ఆషామాషీ వ్యవహారం కాదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు సాక్షి మీడియా కథనం తెలియజేస్తోంది.