ఎల్లుండి నుంచి హైదరాబాద్కు ఈవీఎంలు: ఈసీ, 11న సీఈసీ రాక, ‘షెడ్యూల్పై వ్యాఖ్యలొద్దు’
హైదరాబాద్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పరిస్థితిపై కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందించామని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. కాగా, సోమవారం ఢిల్లీకి ఆయన వెళ్లనున్నట్లు తెలిసింది. రజత్ కుమార్ తన సెలవులు కూడా రద్దు చేసుకున్నారు.
'జోస్యం'తో సంబంధం లేదు: ముందస్తు ఎన్నికలపై స్పష్టతనిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎల్లుండి నుంచి ఈవీఎంలు..
ఎల్లుండి నుంచి హైదరాబాద్కు ఈవీఎంలు వస్తాయని రజత్ కుమార్ తెలిపారు. 2014లో ఉపయోగించిన ఈవీఎంలు ఇప్పుడు పనికిరావని అన్నారు. ఈవీఎంలు వీవీ ప్యాడ్ల కోసం భెల్ కు ఈసీ లేఖ రాసిందని తెలిపారు.32,574 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వాటికి ఇంకా ఎన్ని ఎక్కువ తీసుకోవాలనేది నిర్ణయం కాలేదన్నారు. రాష్ట్రానికి 52,100 బ్యాలెట్ యూనిట్లు, 40,700 కంట్రోల్ యూనిట్లు, 44 వేలు వీవీ ప్యాట్లు సమకూర్చాలని కోరామని రజత్ కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 12నాటి కల్లా రాష్ట్రానికి ఈవీఎంలు, వీవీప్యాట్ల తరలింపు పూర్తవుతుందని ఆయన చెప్పారు. కాగా, ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈసీ సోమవారం లేదా మంగళవారం వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం అయ్యే అవకాశముంది.
ఆరు నెలలోపే ఎన్నికలు..
తెలంగాణ శాసనసభ రద్దు అయినట్టు తమకు సమాచారం అందిందని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ తెలిపారు. యంత్రాంగం సన్నద్ధత ఆధారంగా ఎన్నికలకు వెళ్తామన్నారు. ప్రభుత్వం రద్దయిన ఆర్నెల్లలో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించిందని, ఆ సూచనలకు అనుగుణంగానే తాము చర్యలు చేపడుతున్నామని ఆయన గుర్తు చేశారు. తదుపరి చర్యలపై నివేదికపంపాలని తెలంగాణ ఎన్నికల అధికారిని కోరినట్టు చెప్పారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్పై ఎవరూ వ్యాఖ్యలు చేయొద్దు
నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు రావత్చెప్పారు. ఏర్పాట్లను సమీక్షించాక ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎన్నికల షెడ్యూల్పై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆయన సూచించారు.
11న కేంద్ర ఎన్నికల బృందం
సెప్టెంబర్ 11న కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ప్రతినిధులు తెలంగాణ రాష్ట్రంకు రానున్నారు. తెలంగాణలో అసెంబ్లీ రద్దవడంతో.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పరిస్థితులను అంచనా వేయనున్నారు. సీనియర్ డిప్యూటీ కమిషనర్ ఉమేశ్ సిన్హా ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతినిధి బృందం హైదరాబాద్ రానుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు, సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది.