కాంగ్రెస్ 95, టీడీపీ 14 చోట్ల పోటీ: ఉత్తమ్, సీట్ల కోసం కోదండరాం పట్టు
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణలో మహాకూటమి సీట్ల పొత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 95 స్థానాలలో, తెలుగుదేశం పార్టీ 14 నుంచి 15 స్థానాలలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మిగతా స్థానాల్లో కోదండరాం పార్టీ తెలంగాణ జన సమితి, సీపీఐలకు ఇవ్వనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. అధిష్టానం పెద్దలతో గురువారం ఈ అంశంపై చర్చించారు. అనంతరం కాంగ్రెస్ నేతలు మాట్లాడారు.
టీడీపీకి గట్టి షాక్: పొత్తుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు, చంద్రబాబు ఆశలపై నీళ్లు?
అది రాహుల్ గాంధీ నిర్ణయిస్తారు
ఈ మేరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరాలు తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాపితాపై పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు పరిశీలించిన స్థానాల్లో అభ్యర్థుల ఖరారు ఓ కొలిక్కి వచ్చిందని చెప్పారు. అభ్యర్థుల జాబితా మొత్తాన్ని ఒకేసారి రిలీజ్ చేయాలా లేదా అనే విషయాన్ని తమ పార్టీ అధ్యక్షులు రాహుల్ నిర్ణయిస్తారని తెలిపారు.
మేం 95 స్థానాల్లో, టీడీపీ 14 స్థానాల్లో
ఈ నెల 8వ తేదీన లేదా 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలుగుదేశం పార్టీతో 14 సీట్లకు అంగీకారం కుదిరిందని చెప్పారు. తెలంగాణ జన సమితి, సీపీఐతో సీట్ల సర్దుబాటు పైన చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ పార్టీ 95 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. మిగిలిన 24 స్థానాల్లో 14 స్థానాల్లో టీడీపీ, మిగతా స్థానాల్లో కూటమిలోని ఇతర పార్టీలు పోటీ చేస్తాయన్నారు.
నవంబర్ 8న జాబితా
దాదాపు సీట్లు ఖరారయ్యాని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా అన్నారు. ఈ నెల 5వ తేదీన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మరోసారి సమావేశం కానుందని చెప్పారు. ఆ తర్వాత నవంబర్ 8వ తేదీన జాబితాను విడుదల చేసే అవకాశముందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 95 స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
సీట్లపై ఇంకా తర్జన భర్జన
కాంగ్రెస్ పార్టీ 95 సీట్లలో పోటీ చేస్తామని చెబుతోంది. టీడీపీకి 14, తెలంగాణ జన సమితికి (కోదండరాం పార్టీ) ఆరు నుంచి 8, సీపీఐకి 3 నుంచి నాలుగు సీట్లు ఇవ్వనున్నారు. పది సీట్లను కోదండరాం పార్టీకి, సీపీఐకి సర్దుబాటు చేయనున్నారని తెలుస్తోంది. అయితే కోదండరాం మరో గట్టిగా పట్టుబడితే మరో రెండు సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. సీట్ల విషయంలో టీడీపీ 18 వరకు అడుగుతుండగా, కోదండరాం 12, సీపీఐ 6 సీట్లు అడుగుతుంటే కాంగ్రెస్ అంగీకరించడం లేదు. మరోవైపు, మజ్లిస్ పార్టీ 7 స్థానాల్లో కచ్చితంగా గెలుస్తుందనే అంచనా ఉంది. ఇక్కడి నుంచి కూటమిలోని ఒక్కో పార్టీ రెండు స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ చెబుతున్నాయని తెలుస్తోంది.