ఒడిశా తుపాను సహాయ చర్యల్లో తెలంగాణ విద్యుత్ సిబ్బంది..! యుద్ద ప్రాతిపదికన పనులు..!!
హైదరాబాద్ : ఫొణి తుపాను ప్రభావంతో అతలాకుతమైన ఒడిసా రాష్ట్రంలో విద్యుత్తు పునరుద్ధరణ పనులను తెలంగాణ విద్యుత్తు సంస్థల ఉద్యోగులు విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. మంగళవారం నాటికి రాష్ట్ర రాజధాని భువనేశ్వర్తో పాటు చుట్టుపక్కల 34 కిలోమీటర్ల మేర లైన్లను పునురుద్ధరించి, విద్యుత్తు సరఫరా అందించడంలో వీరు కీలక పాత్ర పోషించారు. తుపాను కారణంగా ఒడిసాలో విద్యుత్తు సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. చాలాచోట్ల కరెంట్ స్తంభాలు పడిపోయాయి. కొన్ని స్తంభాలు వంగిపోయాయి. ట్రాన్స్ఫార్మర్లు కాలి కరెంటు లైన్లు తెగిపోవడంతో 16 జిల్లాల్లో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఒడిసాలో తెలంగాణ సేవలు..!తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు..!!
దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను ప్రత్యేక వాహనాల ద్వారా ఈ నెల 7న ఒడిసాకు పంపించారు. విద్యుత్తు పునరుద్ధరణకు అవసరమైన సామగ్రి, ఆహార సామగ్రి, గుడారాలను కూడా ఉద్యోగులు తమ వెంట తీసుకెళ్లారు. కరెంటు స్తంభాలను సరిచేయడం, ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతు చేయడం, తెగిపోయిన వైర్ల స్థానంలో కొత్తవి బిగించడం లాంటి పనులను ఉద్యోగులు సత్వరంగా చేస్తున్నారు. మధ్య మధ్యలో వర్షం అడ్డంకిగా ఉంటున్నప్పటికీ.. నిర్విరామంగా పనులు చేస్తూ తెలంగాణ శక్తిని చాటుతున్నారు. ఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎల్.గోపయ్య నేతృత్వంలో ఉద్యోగులు పనులు చేస్తున్నారు.
పునరుద్ధరణ పనుల్లో ఉద్యోగులు..! భువనేశ్వర్, పూరి జిల్లాలో విద్యుత్తు సరఫరా..!!
ఇప్పటి వరకు 537 కరెంట్ స్తంభాలను ఏర్పాటుచేసి, పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతంలో 34 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశారు. దెబ్బతిన్న 74 ట్రాన్స్ ఫార్మర్లకు మరమ్మతు చేశారు. భువనేశ్వర్తో పాటు.. పూరి జిల్లాలో విద్యుత్తును పునరుద్ధరించారు. మరోవైపు ఒడిసాలో జరుగుతున్న పనులను హైదరాబాద్లోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో సంస్థ సీఎండీ రఘుమారెడ్డి ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసి, పర్యవేక్షిస్తున్నారు. ఉద్యోగులకు సూచనలు ఇస్తూ పనులు చేయిస్తున్నారు. కాగా, తెలంగాణ ఉద్యోగులు రేయింబవళ్లు కష్టపడి పనిచేసి, విద్యుత్తు పునరుద్ధరణ పనులు చేస్తున్నారని ఒడిసా రాష్ట్రం కోర్దా జిల్లా కలెక్టర్ భూపేందర్ సింగ్ పూనియా ప్రశంసించారు. పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని పేర్కొన్నారు.
వర్షంలోనూ పనులు చేయిస్తున్న ట్రాన్స్కో సీఎండీ..! శబ్బాష్ అంటున్న కొలీగ్స్..!!
కష్టాల్లో ఉన్న వారికి సాయం అందించేందుకు ప్రతికూల వాతావరణంలోనూ తెలంగాణ విద్యుత్తు ఉద్యోగులు శ్రమిస్తున్నారని ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రశంసించారు. ఒడిసాలో విద్యుత్తు పునరుద్ధరణకు తెలంగాణ సహకారం అవసరం ఉందని కోరగానే తాము వెళ్తామని వెయ్యి మంది ఉద్యోగులు సిద్ధపడ్డారని చెప్పారు. వర్షంలోనూ పని చేసి సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారని కొనియాడారు.
శ్రమిస్తున్న విద్యుత్తు ఉద్యోగులు..! ముఖ్యమంత్రి అభినందనలు..!!
ఒడిసాలో తుపాను తాకిడికి గురైన ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్న విద్యుత్తు సిబ్బందికి తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావవు అభినందనలు తెలిపారు. ఒడిసా ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో తెలంగాణ ఉద్యోగులు మానవతా దృక్పథంతో సహాయక చర్యలు చేపట్టారని, తక్కువ సమయంలోనే విద్యుత్తు పునరుద్ధరణ పనులు విజయవంతం చేస్తున్నారని కొనియాడారు.