టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు 27 నుంచి ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణలో టీచర్ల పదోన్నతులు, బదిలీలకు రంగం సిద్ధమైంది. జనవరి 27వ తేదీ నుంచి ప్రభుత్వ టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని టీచర్ల పదోన్నతులు, బదిలీలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇందరారెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి బషీర్బాగ్లోని విద్యాశాఖ కార్యాలయంలో విద్యా శాఖ కార్యదర్శి వాకటి కరుణ, పాఠశాల విద్యా డైరెక్టరేట్ దేవసేన, ఇతర అధికారులతో సమీక్షించారు.
జనవరి 27 నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సమగ్ర షెడ్యూల్ ను వెంటనే విడుదల చేయాలని మంత్రి సబిత అధికారులను ఆదేశించారు.
ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అధికారులను కోరారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీ ప్రక్రియకు ప్రభుత్వం అనుమతిచ్చినందున ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా సజావుగా పూర్తయ్యేలా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.