అదే కరెంట్ వ్యవహారం.!నాడు బాబు నేడు కేసీఆర్.!అధిక బిల్లులపై ప్రజాగ్రహ పర్యవసానం ఎటువైపు.?
హైదరాబాద్ : తెలంగాణ ప్రజానీకం నివురుగప్పిన నిప్పులా కనిపిస్తున్నారు. కరోనా వైరస్ వల్ల ఏర్పడిన లాక్డౌన్ కష్టకాలంలో మూడు నెలలపాటు కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని ఎంతో పెద్ద మనసుతో తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటన పట్ల ప్రజలు పెద్ద ఎత్తున హర్షాన్ని వ్యక్తం చేసారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తెలంగాణ ముఖ్యమంత్రిలా ప్రజలను అర్ధం చేసుకోలేరనే అభిప్రాయాలను కూడా వ్యక్తం చేసారు. సీఎం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తుండగానే మూడు నెలల కాలం గిర్రును తిరిగిపోయింది. అటు మీటర్ రీడింగ్ కూడా మళ్లీ మొదలైంది. ఇక్కడే అసలు కథ మొదలైనట్టు తెలుస్తోంది.
ఊహించని కరెంటు బిల్లులు..
లాక్డౌన్ సమయంలో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలను రూపొందించాయి. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలతో పాటు మధ్యతరగతి ప్రజలకోసం అనేక కార్యక్రమాలు అమలు చేసాయి. లాక్డౌన్ ఆంక్షల సమయంలో జీవనోపాది కోల్పోయిన ప్రతి ఒక్కరిని ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వాలు కార్యాచరణ ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వానికి ధీటుగా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. నిత్యావసర సరుకులతో పాటు ఇతర ఖర్చులకోసం నగదును కూడా తెలంగాణ ప్రభుత్వం అర్హులైన పేదలకు అందించింది. అంతే కాకుండా లాక్డౌన్ సమయంలో ఇంటి అద్దె, కరెంటు బిల్లులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎం ప్రకటించారు.
అప్పుడు లాక్డౌన్ కష్టాలు..
సీఎం చంద్రశేఖర్ రావు ప్రకటన పట్ల యావత్ తెలంగాణ ప్రజానికం ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఐతే లాక్డౌన్ సమయం ముగిసిన తర్వాత యధావిధిగా మొదలైన కరెంట్ బిల్లుల వ్యవహారం ప్రజలను షాక్ కు గురిచేసింది. మూడు నెలల పాటు కరెంటు బిల్లులు కట్టకపోడంతో సాధారణంగా మూడు నెలలకు రావాల్సిన బిల్లులు పెద్దమొత్తంలో రావడంతో ప్రజలు అయోమయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా నెలకు రెండు వందలు వచ్చే కరెంటు బిల్లు మూడు నెలలకు కలిపి ఆరు వందలు రావాలి. కాని మారిన స్లాబ్ తో ఏకంగా 15వందల పైన బిల్లు రావడంతో సామాన్య వినియోగ దారుడు అవాక్కయ్యే పరిస్ధితులు తలెత్తాయి.
అధిక బిల్లులపై కేసీఆర్ జోక్యం చేసుకోవాలి..
మూడు నెలల పాటు కరెంటు బిల్లులు కట్టొందంటే సంతోషించాం కాని తర్వాత వస్తున్న బిల్లులు చెల్లించలేని పరిస్ధితిలో ఉన్నాయని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలకు సాధారణంగా రావాల్సిన బిల్లుకన్నా అధికంగా రావడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. సీఎం చంద్రశేఖర్ రావు చొరవ తీసుకుని అధికంగా వచ్చిన బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, దీక్షలు కూడా నిర్వహిస్తున్నారు వినియోగదారులు. లాక్డౌన్ గడువు ముగిసిన వెంటనే ఆర్ధిక కార్యకలాపాలు గాడినపడేందుకు సమయం పడుతుందని, వెంటనే అధికంగా వచ్చిన కరెంటు బిల్లులు చెల్లించలేమని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.
Recommended Video
గాడిన పడని ఆర్థిక వ్యవస్థ..
కరెంటు బిల్లులపై ప్రజాగ్రహం చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ప్రతి వినియోగదారుడు అధికంగా వచ్చిన బిల్లుల పట్ల ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. స్వయంగా సీఎం ప్రకటన చేసారు కాబట్టి మూడు నెలలుగా కరెంటు బిల్లులు కట్టలేదని, లేకపోతే ఏదో విధంగా బిల్లులు చెల్లించే వాళ్లమనే అభిప్రాయాన్ని కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కరెంటు బిల్లుల చెల్లింపుల అంశంలో సీఎం చంద్రశేఖర్ రావు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. 2004లో ఇదే కరెంటు వ్యవహారంతో చెలరేగిన ఆగ్రహ జ్వాలలకు అధికారంలో ఉన్న ఆనాటి తెలుగుదేశం పార్టీ ఆహుతైపోయింది. ప్రస్తుతం కరెంటు బిల్లుల వ్యవహారంలో గులాబీ పార్టీ త్వరిగతిన ప్రజామోద నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితి చేయిదాటే సూచనలు కనిపిస్తున్నాయి.