రాచకొండ పోలీసుల సాహసం: మంటల్లో చిక్కుకున్న గేదెలను కాపాడిన వైనం: అగ్ని కీలలను లెక్క చేయక
యాదాద్రి: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేస్తోన్న లాక్డౌన్ డ్యూటీలో తలమునకలై ఉన్న రాచకొండ పోలీసులు మరో సాహసం చేశారు. మంటల్లో చిక్కుకున్న పశువుల కొట్టం నుంచి మూగజీవాలను కాపాడారు. అగ్నికీలలను లెక్క చేయకుండా వారు ఆ కొట్టంలో బంధించి ఉన్న పశువులను బయటికి పంపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మూగజీవాలను కాపాడటానికి పోలీసులు చూపించిన తెగువను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ప్రశంసించారు.
Recommended Video
యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇస్కిళ్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయం పరిధిలోకి వస్తుందీ పోలీస్స్టేషన్. లాక్డౌన్ డ్యూటీలో భాగంగా రామన్నపేట్ పోలీసులు పీ యాదగిరి, కే రవీందర్ రెడ్డి కక్కినేని గ్రామం నుంచి ఇస్కిళ్ల వైపు పెట్రోలింగ్ వెళ్తుండగా.. రోడ్డు పక్కన మంటలు అంటుకున్న దృశ్యాన్ని చూశారు. అందులో నాలుగు పాడి గేదెలు కనిపించాయి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారు గొడ్ల చావిడి వైపు పరుగెత్తారు. గెదెలకు కట్టిన తాళ్ల విప్పదీసి, బయటికి పంపించారు. మంటలను ఆర్పివేయడానికి ప్రయత్నించారు.
గొడ్ల చావిడి చుట్టు పక్కల గాలించారు. ఎవరూ కనిపించకపోవడంతో గ్రామ సర్పంచ్కు ఫోన్ చేశారు. ఈ సమాచారాన్ని అందించారు. మంటలు ఎలా అంటుకుని ఉంటాయనే విషయంపై ఆరా తీశారు. పశువుల కొట్టం యజమానికి ఈ విషయాన్ని తెలియజేయాలని సూచించారు. పొలీసులను ప్రదర్శించిన సాహసాన్ని ఇస్కిళ్ల గ్రామస్తులు ప్రశంసించారు. పోలీసులకు కృతజ్ఙతలు తెలుపుకొన్నారు. సాధారణంగా రద్దీగా ఉండే ఈ మార్గం లాక్డౌన్ వల్ల బోసిపోయిందని, అదే సమయంలో పోలీసులు అటుగా రాకపోయి ఉంటే తీవ్రనష్టం సంభవించి ఉండేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
రాచకొండ పోలీసుల సాహసం: మంటల్లో చిక్కుకున్న గేదెలను కాపాడిన వైనం: అగ్ని కీలలను లెక్క చేయక#telanagana #Telanganapolice #Hyderabadcitypolice pic.twitter.com/Sua3zMudQt
— oneindiatelugu (@oneindiatelugu) April 22, 2020
పోలీసుల పనితీరును రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ప్రశంసించారు. ఆ సమయంలో వారు ఆ మార్గంలో పెట్రోలింగ్లో లేకపోయి ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉండేవని అన్నారు. మంటలు మరింత విస్తరించి ఉండేవని, మూగజీవాలు సజీవ దహనం అయ్యేవని చెప్పారు. లాక్డౌన్ డ్యూటీలో తలమునలై ఉన్న సమయంలోనూ ప్రమాదాన్ని పసిగట్టి, సమయస్ఫూర్తిని ప్రదర్శించారని ప్రశంసించారు. పోలీసుల సాహసానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. వారి చర్యల పట్ల నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.