మరో అల్పపీడనం, భారీ వర్షాలు - సీఎం కేసీఆర్ వార్నింగ్ - వరంగల్కు మంత్రి కేటీఆర్
''గడిచిన నాలుగైదురోజుల వర్షానికి రాష్ట్రంలోని చెరువులు, జలాశయాలకు వరద పోటెత్తింది. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉంది. కానీ రాబోయే నాలుగు రోజులు చాలా ముఖ్యం. ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్ గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో కొనసాగుతున్న అల్పపీడనం, అల్పపీడనానికి అనుబంధంగా 5.8 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వల్ల భారీ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయి. దీనికి తోడు ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఈనెల 19 న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది'' అని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు.
కరోనా వేళ కేసీఆర్ కీలక నిర్ణయం - సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ - అనూహ్య మార్పులు
వర్షాలు, వరదలపై రివ్యూ
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలు, చేపట్టాల్సిన పనులపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో రివ్యూ నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ, రెవెన్యూ, జల వనరులు, విద్యుత్, మున్సిపల్, పంచాయతీ రాజ్, వ్యవసాయం, ఆర్ అండ్ బీ తదితర శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో మాట్లాడిన ఆయన జిల్లాల వారీగా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు.
నాలుగు రోజులు బీ అలెర్ట్..
ఉపరితల ఆవర్తనానికితోడు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, మరోవైపు వైపు గోదావరి, కృష్ణ, తుంగభద్ర, ప్రాణహిత, ఇంద్రావతి నదులకు నీరందించే క్యాచ్ మెంట్ ఏరియా కలిగిన ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయని, ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి, రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలను అంచనా వేసి అందుకు తగినట్లు ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం సూచించారు. ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడడమే ప్రధాన లక్ష్యంగా యంత్రాంగం పని చేయాలని, ఎక్కడికక్కడ కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని, సహాయక చర్యల కోసం అవసరమైన నిధులు సిద్ధంగా ఉన్నాయని సీఎం చెప్పారు.
వెనక్కి తగ్గని హీరో రామ్ పోతినేని - మరింత గట్టిగా ఎదురుదాడి - ఈసారి కులం పేరుతోనే
విద్యుత్, మున్సిపల్ శాఖలు భేష్..
ప్రకృత వైపరీత్యం తలెత్తినా సరే ఎక్కడా ఏమాత్రం అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, విద్యుత్ డిమాండ్ లో భారీ వ్యత్యాసం వచ్చినా గ్రిడ్ ఫెయిల్ కాకుండా సమర్థవంతంగా వ్యవహరించిన విద్యుత్ శాఖను, హైదరాబాద్ తో పాటు ఇతర నగరాల్లో పెద్ద కష్టం, భారీ నష్టం కలగకుండా చర్యలు తీసుకున్న మున్సిపల్ శాఖను ముఖ్యమంత్రి అభినందించారు. విపత్తు సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చేయడంతో పాటు, గ్రిడ్ ఫెయిల్ కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారని సిఎండి ప్రభాకర్ రావు, ఇతర విద్యుత్ సిబ్బందిని సీఎం మెచ్చుకున్నారు.
Recommended Video
వరద బాధిత వరంగల్కు కేటీఆర్..
వరంగల్ నగరాన్ని ముంచెత్తిన వానలు, వరదల పరిస్థితిని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమీక్షించారు. అక్కడ చేపట్టిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ నగరంలో స్వయంగా పర్యటించి, పరిస్థితిని పర్యవేక్షించి, అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కేటీఆర్, ఈటల రాజేందర్ లను ఆదేశించారు. ఈ ఇద్దరూ మంగళవారం ఉదయం హెలి కాప్టర్లో వరంగల్ వెళతారు. జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ కూడా వీరితో కలుస్తారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన తర్వాత వరంగల్ ఎంజిఎంకు కూడా మంత్రులు వెళ్లనున్నారు.