రంజాన్ స్పెషల్: కరోనా ముస్లిం పేషెంట్లకు కేసీఆర్ సర్కార్ తీపి కబురు: చికెన్ బిర్యాని.. మటన్ కర్రీ
హైదరాబాద్: ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ మాసం శుక్రవారం ఆరంభమైంది. ఈ సాయంత్రానికి నెలవంకను దర్శించిన అనంతరం.. ముస్లింలు తమ కఠోర ఉపవాస దీక్షలను ప్రారంభిస్తారు. నెలరోజుల పాటు ఈ ఉపవాస దీక్షలు కొనసాగుతాయి. వచ్చేనెల 24వ తేదీన రంజాన్ పండుగను నిర్వహించుకుంటారు. కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్ని కమ్మేసిన ప్రస్తుత పరిస్థితుల్లో రంజాన్ నెల మొత్తం బోసిపోయి కనిపించడం దాదాపుగా ఖాయమైనట్టే.
గ్రామ పంచాయతీలకు రంగులు ఫిక్స్: ఆ నాలుగుకూ ఒకే: ఒక్కో రంగుకు ఒక్కో అర్థం..!
రంజాన్ ఫ్లేవర్ మిస్ అయినట్టే..
సాధారణంగా రంజాన్ మాసం ఆరంభ సమయంలో హైదరాబాద్ సరికొత్త అందాలను సంతరించుకుంటుంది. జంటనగరాల్లో ఎక్కడికి వెళ్లినా రంజాన్ ఫ్లేవర్ కనిపిస్తుంటుంది. ప్రత్యేకించి- ముస్లింల జనాభా అధికంగా ఉండే పాతబస్తీలో రంజాన్ పండుగ వాతావరణాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఈ నెల రోజుల పాటు నైట్ బజార్ అందుబాటులోకి రావడం వల్ల చార్మినార్, మక్కా మసీదు, ఆ చారిత్రాత్మక కట్టడాల పరిసర ప్రాంతాల్లో రంజాన్ సౌరభం గుభాళిస్తుంటుంది. రాత్రంతా విద్యుద్దీపాల వెలుగులో వెలిగిపోతుంటుందీ పాతబస్తీ.
క్వారంటైన్ కేంద్రాలు, ఐసొలేషన్ వార్డుల్లో
అదలావుంచితే- కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ను అమల్లోకి తీసుకుని రావడం వల్ల ముస్లింలు ఇక ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్ బారిన పడిన వారిలో ముస్లింల సంఖ్యే అధికంగా ఉండటం వల్ల మనస్ఫూర్తిగా ఈ సారి రంజాన్ను జరుపుకోలేకపోతున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి సహా తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డులు, క్వారంటైన్లలో కాలం గడుపుతున్నారు ముస్లింలు. దీనితో ఈ సారి రంజాన్ పండుగ బోసిపోయినట్టే. వచ్చే నెల 3వ తేదీ తరువాత కూడా లాక్డౌన్ ముగిసే అవకాశాలు దాదాపు లేకపోవడం వల్ల ఈ నెల మొత్తం ఇళ్లకే పరిమితం కావాల్సిన రావచ్చు.
రంజాన్ మెనూ స్పెషల్..
ప్రస్తుతం ఇలాంటి దుస్థితిలో ఉన్న కరోనా వైరస్ ముస్లిం పేషెంట్లకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురును అందించింది. రంజాన్ రోజుల్లో ముస్లింల ఇళ్లల్లో తయారయ్యే వంటకాల మాదిరిగానే ఐసొలేషన్ వార్డులు, క్వారంటైన్లలో ఉండే వారికి రంజాన్ స్పెషల్ ఫుడ్ను అందించబోతోంది. ఉపవాస దీక్ష ఆరంభానికి ముందు.. విరమించిన తరువాత వారికి వెజ్, నాన్ వెజ్ వంటకాలతో కూడిన భోజనాన్ని వడ్డించబోతోంది. శనివారం నుంచి ఈ రంజాన్ మెనూ అందుబాటులోకి రానుంది.
మెనూ ఇదే..
కరోనా వైరస్ బారిన పడిన ముస్లిం పేషెంట్లు తెల్లవారు జామున 3:30 గంటల సమయంలో ఉపవాస దీక్షను ఆరంభిస్తుంటారు. ఆ సమయంలో వారికి షెహరిగా రొట్టెలు, వెజ్ కర్రీ, దాల్ అందిస్తారు. సాయంత్రం ఉపవాస దీక్షను విరమించే సమయంలో ఇఫ్తార్గా ఖిచిడి, చికెన్ కర్రీ, బగారా రైస్, దాల్చా, వెజ్ బిర్యాని, చికెన్ బిర్యానీని అందిస్తారు. మటన్ కర్రీ లేదా చికెన్ కర్రీని రోజు విడిచి రోజు వడ్డిస్తారు. అలాగే ఉపవాస దీక్షను విరమించిన తరువాత అల్పాహారంగా ఖర్జూరం, అరటిపండ్లు, ఇతర పండ్లను అందిస్తారు. ఈ నెల రోజులూ ఇదే రకమైన ఆహారాన్ని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
ముస్లిమేతర పేషెంట్లు వేరే గదిలోకి..
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న కరోనా వైరస్ ముస్లిమేతర పేషెంట్లను వేరే గదిలోకి తరలించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న వార్డుల్లో అన్ని రకాల మతాలకు చెందిన వారు చికిత్స తీసుకుంటున్నారు. రంజాన్ మాసం ఆరంభం కావడం వల్ల ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి వీలుగా వారందర్నీ ఒకే వార్డులోకి తీసుకుని రానున్నారు. ముస్లిమేతరులను ఇతర వార్డుల్లోకి షిఫ్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ముస్లిమేతర పేషెంట్లకు ఇబ్బందిగా ఉండకపోవడం, ముస్లిం పేషెంట్లు నమాజ్ సమయంలో సోషల్ డిస్టెన్సింగ్ను పాటించడానికి అవసరమైన స్థలం లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
Recommended Video